భారత అథ్లెట్ల చారిత్రాత్మక రికార్డు: 24 గంటల పరుగు పందెంలో 'హ్యాట్రిక్'!
జపాన్లోని హిరోసాకి నగరంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి "ఐఏయూ 24 గంటల ఆసియా- ఓషియానియా ఛాంపియన్షిప్" లో భారత అథ్లెట్ల బృందం అపూర్వమైన విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో మొదటి మూడు స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, ఓవరాల్ టీమ్ కేటగిరీలోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకుని ఆసియా ఖండంలో భారత్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా.. గత 2022, 2024 లలో సాధించిన టైటిల్స్ తర్వాత ఇప్పుడు 2026 లోనూ విజేతగా నిలిచి వరుసగా మూడోసారి 'హ్యాట్రిక్ ఛాంపియన్' గా అవతరించింది.
అమర్ సింగ్ సరికొత్త జాతీయ రికార్డు.. పోడియంపై భారతీయులే!
పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత అథ్లెట్ అమర్ సింగ్ దేవాండా ఊహించని రీతిలో చెలరేగి ఆడాడు. అతను ఏకధాటిగా 24 గంటల పాటు పరిగెత్తి ఏకంగా 282.881 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి సరికొత్త జాతీయ రికార్డుతో పాటు స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. కేవలం 3 కిలోమీటర్ల స్వల్ప తేడాతో ఆసియా రికార్డును కోల్పోయినప్పటికీ, 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యుత్తమ మైలేజీగా ఇది రికార్డు సృష్టించింది. అమర్ సింగ్ తర్వాతి స్థానాల్లో నిలిచిన తోటి భారత రన్నర్లు జినో ఆంటోని రజత పతకాన్ని, సౌరవ్ కుమార్ రంజన్ కాంస్య పతకాన్ని దక్కించుకుని పోడియంపై భారత్ను అగ్రభాగాన నిలిపారు.

ఆసియా రికార్డును బద్దలు కొట్టిన పురుషుల జట్టు.. మహిళలకూ పతకం
పురుషుల టీమ్ విభాగంలో భారత్ సంయుక్తంగా 815.833 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి సరికొత్త ఆసియా రికార్డును నమోదు చేసింది. ఐఏయూ (IAU) ఛాంపియన్షిప్ చరిత్రలో ఏ ఆసియా దేశం కూడా ఇంతటి భారీ రికార్డు దూరాన్ని నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ విభాగంలో ఆతిథ్య జపాన్ రజత పతకంతో, ఆస్ట్రేలియా కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు మహిళల విభాగంలోనూ భారత అథ్లెట్ టెంజిన్ డోల్మా 228.939 కిలోమీటర్లు పరిగెత్తి జాతీయ రికార్డుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది.
టోర్నీలో నమోదైన ప్రధాన రికార్డుల పట్టిక:
పురుషుల వ్యక్తిగత విభాగం:
*బంగారం (స్వర్ణం): అమర్ సింగ్ దేవాండా – 282.881 కి.మీ. (226 రౌండ్లు - సరికొత్త జాతీయ రికార్డు)
*వెండి (రజతం): జినో ఆంటోని – 272.894 కి.మీ. (218 రౌండ్లు)
*కాంస్యం: సౌరవ్ కుమార్ రంజన్ – 260.058 కి.మీ. (208 రౌండ్లు)
పురుషుల టీమ్ విభాగం:
*మొదటి స్థానం: భారత్ – 815.833 కి.మీ. (స్వర్ణ పతకం - ఆల్ టైమ్ ఆసియా రికార్డ్)
*రెండో స్థానం: జపాన్ – 754.726 కి.మీ. (రజత పతకం)
*మూడో స్థానం: ఆస్ట్రేలియా – 732.525 కి.మీ. (కాంస్య పతకం)
మహిళల టీమ్ విభాగం:
*మొదటి స్థానం: జపాన్ – 707.357 కి.మీ. (స్వర్ణ పతకం)
*రెండో స్థానం: ఆస్ట్రేలియా – 684.450 కి.మీ. (రజత పతకం)
*మూడో స్థానం: భారతదేశం – 667.722 కి.మీ. (కాంస్య పతకం)
సమిష్టి కృషికి దక్కిన ఫలితం: కోచ్ సంతోష్ పద్మనాభన్
ఈ టోర్నీలో పాల్గొన్న 11 మంది భారతీయ అథ్లెట్లలో 8 మంది తమ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేయడం విశేషం. ఈ చారిత్రక విజయంపై భారత జట్టు ప్రధాన కోచ్ సంతోష్ పద్మనాభన్ స్పందిస్తూ.. ఈ అద్భుతమైన క్షణం దేశంలోని అల్ట్రా రన్నింగ్ కమ్యూనిటీ సాధించిన అతిపెద్ద విజయమని కొనియాడారు. ఇది కేవలం అథ్లెట్ల కష్టమే కాకుండా, వారికి అండగా నిలిచిన సహాయక సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, న్యూట్రిషనిస్టుల సమిష్టి కృషికి దక్కిన అద్భుత ఫలితమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications