World Archery Championship 2025: ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. ఒక స్వర్ణ పతకం, ఒక రజత పతకం సాధించి భారత్ ఆర్చరీకి కొత్త ఊపునిచ్చింది. ఈ విజయం భారత క్రీడల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది.
పురుషుల టీమ్కు తొలి ప్రపంచ ఛాంపియన్ షిప్ స్వర్ణం
భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో బలమైన ఫ్రాన్స్ జట్టును ఓడించి ప్రపంచ ఛాంపియన్ షిప్లో తమ మొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ జట్టులో ప్రథమేశ్ ఫుగే, అమన్ సైనీ, రిషబ్ యాదవ్ ఉన్నారు. ఫైనల్లో భారత జట్టు ఫ్రాన్స్ను 235-233 పాయింట్ల తేడాతో ఓడించింది. మూడు సెట్ల తర్వాత ఇరుజట్లు 176-176 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే నిర్ణయాత్మక చివరి సెట్లో భారత జట్టు తమ ప్రతిభను ప్రదర్శించి 59 పాయింట్లు సాధించి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.

మిక్స్డ్ టీమ్కు రజత పతకం
భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించగా.. మరోవైపు జ్యోతి సురేఖ వెన్నం, రిషబ్ యాదవ్ల కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 155-157 తేడాతో స్వల్ప తేడాతో ఓడి రజత పతకాన్ని గెలుచుకుంది. కేవలం రెండు పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని మిస్ చేసుకుంది. ఈ జంట కూడా టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
రిషభ్ యాదవ్, జ్యోతి సురేఖల అద్భుత ఫామ్
ఈ సంవత్సరం రిషభ్ యాదవ్, జ్యోతి కలిసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. మేలో షాంఘైలో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 2లో వీరు ప్రపంచ రికార్డు సృష్టించారు. అలాగే సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 1లో స్వర్ణం, మాడ్రిడ్లో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 4లో కాంస్యం సాధించారు. ఈ విజయాలు భారత ఆర్చరీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నాయి.