హైదరాబాద్: బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు మంగళవారం ఒక్కరోజే మూడు కాంస్య పతకాలు సాధించారు. దీంతో టోర్నీలో భారత పతకాల సంఖ్య మంగళవారం నాటికి నాలుగుకు చేరింది. టోర్నీ తొలి రోజు ఒక కాంస్యం నెగ్గిన భారత్, రెండోరోజు మరో మూడు కాంస్యాలు సాధించింది.
పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ కాంస్య పోరులో అతాను దాస్ కాంస్యం గెలిచాడు. షూటాఫ్లో 6-5తో జిన్ హయెక్ (కొరియా)ను ఓడించాడు. రికర్వ్ పురుషుల టీమ్ విభాగంలో తరుణ్దీప్ రాయ్, జయంత్, అతాలతో కూడిన భారత జట్టు 6-2తో చైనా జట్టుపై నెగ్గి కాంస్యం గెలుచుకుంది.
అరుదైన గౌరవం: జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్కి గంభీర్ పేరు, ట్విట్టర్లో ఫోటోలు
ఇదే టోర్నీలో దీపిక కుమారితో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన అతాను దాస్ మొత్తంగా హ్యాట్రిక్ సాధించాడు. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపిక కుమారి, బొంబ్యాల దేవి, అంకితలతో కూడిన భారత జట్టు 5-1తో జపాన్పై గెలవడంతో భారత్ తన ఖాతాలో మూడో కాంస్యాన్ని వేసుకుంది.
PBL Auction: సింధుకే అగ్రతాంబూలం, తైజు కోసం పోటీపడిన పుణె-బెంగళూరు
భారత ఆర్చరీ సంఘంపై నిషేధం విధించడంతో స్వతంత్ర క్రీడాకారులుగా బరిలో దిగిన మన ఆర్చర్లు ఇప్పటికే నాలుగు పతకాలు సాధించడంతో పాటు మరో మూడు ఈవెంట్లలో ఫైనల్స్కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నారు.