
ఫైనల్, సెమీస్లో పురుషుల గ్రాండ్ ఎంట్రీ..
పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో నీరజ్ చోప్రా ఫైనల్స్కు అర్హత సాధించాడు. రెజ్లింగ్ కేటగిరీలో రవి కుమార్ దహియా, దీపక్ పునియా సెమీ ఫైనల్స్కు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూడు విభాగాల్లో వారు అర్హత సాధించిన తీరు చూస్తోంటే.. భారత్కు మరిన్ని పతకాలు ఖాయం అయ్యేలా కనిపిస్తోంది.
తన పతకాల సంఖ్యను భారత్ మెరుగుపర్చుకోవడంపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదనే పరిస్థితిని కల్పించింది. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలోనే ఫైనల్స్కు అర్హత పొందడం, క్వార్టర్ ఫైనల్స్లో రవి కుమార్ దహియా, దీపక్ పునియా తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలను అందుకోవడం ఆసక్తి రేపుతోంది.

హాకీ వేట మొదలు..
అదే సమయంలో- భారత మహిళా హాకీ జట్టు కూడా పతకాల వేటలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. రాణి రాంపాల్ సారథ్యంలోని భారత్ మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్లో అర్జెంటీనాను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఓఐ హాకీ స్టేడియంలోని నార్త్ పిచ్ ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు వేదికగా మారనుంది.
క్వార్టర్ ఫైనల్స్లో విమెన్స్ హాకీ ఇండియా సాధించిన విజయాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే.. ప్రత్యర్థి దూకుడుకు భారత్ అలవోకగా అడ్డుకట్ట వేస్తుందనిపించేలా ఉంది. ఎందుకంటే- బలమైన ఆస్ట్రేలియాపై గోల్ కీపర్ సవిత పునియా ఏకంగా ఎనిమిది పెనాల్టీ కార్నర్లను అడ్డుకున్నారు.

రాణి రాంపాల్ టీమ్ ప్రస్థానం ఇదీ..
రాణి రాంపాల్ టీమ్ గ్రూప్ దశలోనే వెనుదిరగాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ టోక్యో ఒలింపిక్స్లో పతకాల వేట నాసిరంగా ప్రారంభమైంది. పూల్-ఏలో మొదట్లో వరుస ఓటములను చవి చూసింది జట్టు. అయిదింట్లో మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది.
ఈ దశలో భారత మహిళా హాకీ జట్టు కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు.. సెమీ ఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టిస్తుందని భావించనూ లేదు. అందరి అంచనాలను తలకిందులు చేసింది టీమ్. సమష్టిగా రాణించింది.. సత్తా చాటింది. మెరుపుల్లాంటి పాసింగ్స్తో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

ఇప్పటిదాకా ఎదురుపడని అర్జెంటీనా..
గ్రూప్ దశలో అర్జెంటీనా జట్టును భారత్ ఎదుర్కొనలేదు. వేర్వేరు గ్రూపుల్లో ఉండటం వల్ల అది సాధ్య పడలేదు. ఫలితంగా- ఒకరి బలాలు, బలహీనతలు ఎలాంటివో తెలుసుకోవడానికి వీలు కలగలేదు. ఈ టోర్నమెంట్లో భారత్ తాను ఎదుర్కొన్న తొలి మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్పై ఏకంగా 5-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
రెండో మ్యాచ్లో జర్మనీ టీమ్ను ఢీ కొట్టి.. ఓడిపోయింది. మూడో మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ చేతిలో పరాభవం పొందింది. ఆ తరువాతి మ్యాచుల్లో విజృంభించింది. నాలుగో మ్యాచ్లో ఐర్లాండ్పై 1-0 గోల్స్తో విజయం సాధించడం జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. అదే ఊపుతో గ్రూప్ దశలో అయిదో మ్యాచ్ను కూడా గెలుచుకుంది. ఆ మ్యాచ్లో బలమైన దక్షిణాఫ్రికాను ఓడించింది.

క్వార్టర్స్లో అడ్డుగోడ..
క్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు భారత్. గుర్జీత్ కౌర్ సాధించిన గోల్తో మ్యాచ్ను తన వశం చేసుకుంది. సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్స్లో భారత్ అత్యద్భుతంగా ఆడింది. విమెన్ హాకీ ప్లేయర్ల గ్రౌండ్లో పాదరసంలా కదిలారు. గ్రూప్ దశలో సాధించిన వరుస విజయాల దూకుడును ఇక్కడా కొనసాగించారు.
ప్రత్యర్థులను కట్టడి చేయడానికి పక్కాగా రూపొందించుకున్న వ్యూహాలను అదే స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఎక్కడే గానీ పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు.. తడబడనూ లేదు. బలమైన ఆస్ట్రేలియా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. గోల్ కీపర్ సవిత పునియా ఎనిమిది పెనాల్టీ కార్నర్లను అడ్డుకున్నారు.

గ్రూప్ దశలో సత్తా చాటిన అర్జెంటీనా..
అర్జెంటీనా కూడా తక్కువేమీ తినలేదు. గ్రూప్ దశలో అద్భుత విజయాలను అందుకుంటూ వచ్చింది. గ్రూప్స్లో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 3-0 ఓడిందా టీమ్. అంతే ఓటమి అనేదే తెలియకుండా సెమీస్కు చేరింది. స్పెయిన్పై 3-0, చైనాపై 3-2, జపాన్పై 2-1 గోల్స్ తేడాతో పైచేయిని సాధించింది. ఆస్ట్రేలియాపై 2-1, జర్మనీని 2-0 గోల్స్తో మట్టి కరిపించింది. అలాంటి జట్టును భారత్ ఢీ కొట్టబోతోంది. సెమీ ఫైనల్స్లో అర్జెంటీనా దూకుడుకు బ్రేక్ వేయాలంటే పక్క వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
దాన్ని అంతే పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండూ గనక భారత మహిళల హాకీ జట్టు చేయగలిగితే.. చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పతకాన్ని ముద్దాడటాన్ని ఖాయం చేసుకుంటుంది. అది జరగాలంటే అర్జెంటీనాను రాణి రాంపాల్ సేన ఓడించడంపైనే ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications
