హోమిల్టన్: భారత క్రికెట్ జట్టు మంచి స్థితిలో ఉందని, వరుసగా రెండోసారి ప్రపంచ కప్ మనదేనని రవిశాస్త్రి మంగళవారం అన్నాడు. ఐర్లాండ్ పైన గెలిచిన అనంతరం ఆయన మాట్లాడాడు. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ నాకౌటే అయినందున ఈ స్థితిలో ఉండడం మంచి పరిణామమని, గెలవడం మొదలైతే చాలు జట్టుపై ఒత్తిడి తగ్గిపోతుందన్నాడు.
ప్రస్తుతం జట్టు గెలుపును ఆస్వాదిస్తోందన్నాడు. ఫుట్బాల్ జట్టులాగా అంతా కలిసికట్టుగా ఆడుతున్నారని చెప్పాడు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం రవిశాస్ర్తీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రపంచ కప్ వేదికపై జట్టులోని బౌలర్లు రాణించడమే జట్టు ఈ స్థితికి చేరుకోవడానికి కారణమన్నాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్మెన్లు రాణించడంతో బౌలర్ల ప్రతిభ మసకబారుతుంది. జట్టు విజయాల్లో బౌలర్లకు కూడా కొంత పాత్ర లభించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నాడు.
బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే ఆటగాళ్లంటే తనకెంతో ఇష్టమని ధోనీ అన్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్ శిఖర్ ధావన్ తాను అప్పగించిన బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారంటూ ధోనీ ప్రశంసించాడు.

స్పిన్నర్లు నిజంగా చాలా బాగా బౌల్ చేశారని, ముఖ్యంగా అశ్విన్ విషయానికి వస్తే తాను ఎప్పుడూ ఇష్టపడే బౌలర్లలో అతను ఒకడని, ఎన్నోసార్లు క్లిష్టపరిస్థితుల్లో నేను అతడ్ని బౌలింగ్ చేయమని కోరానని, ఎందుకంటే అతనికి తన బౌలింగ్ సత్తా గురించి బాగా తెలుసునని చెప్పాడు.
మేం పుంజుకుంటే వారు దెబ్బతీశారు: పోర్టర్ ఫీల్డ్
తాము పుంజుకుంటున్న ప్రతిసారి భారత బౌలర్లు వికెట్లు పడగొట్టారని ఐర్లాండ్ సారథి పోర్టర్ ఫీల్డ్ అన్నాడు. అశ్విన్ బాగా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు. వేగంలో మార్పులతో బోల్తా కొట్టించాడని, ప్రత్యర్థుల ముందు ప్రతిసారి తాము మంచి లక్ష్యాలనే ఉంచామన్నాడు.
తమకు పెద్ద జట్లతో ఆడే అవకాశాలు మరిన్ని రావాలన్నాడు. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్లు అడిన అనుభవం లేకపోవడమే తమ జట్టు ఓటమికి కారణమన్నాడు. పిచ్నుంచి భారత బౌలర్లకు కొంత సహకారం లభించిందన్నాడు.
షమి రికార్డ్
షమి 2013 నుండి మూడు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన సందర్భాలు 15 ఉన్నాయి. మరే బౌలర్ ఇన్నిసార్లు ఈ ఘనత సాధించలేదు. మరోవైపు ఈ ప్రపంచ కప్లో ధావన్ ఇప్పటి వరకు 333 పరుగులు చేశాడు. అథ్యధిక పరుగుల జాబితాలో సంగక్కర తర్వాత ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు వన్డేల్లో నాలుగువేలకు పైగా పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ చేరాడు.