న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో అత్యంత ఆనందకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ రెండు జట్లు పోటీ పడడం భారతదేశానికి, బంగ్లాదేశ్కు కీర్తిని ప్రసాదించింది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య సారూప్యత లేకున్నా జాతీయ గీతాల విషయంలో మాత్రం ఇరు దేశాలకు ఎంతో దగ్గర సంబంధం ఉంది.
భారత జాతీయ గేయం 'జనగణమన', బంగ్లా జాతీయ గీతం 'అమర్ సోనార్ బంగ్లా' రెండూ విశ్వకవి రవీంద్రుడి కలం నుంచి జాలువారినవే. క్వార్టర్స్లో భారత్-బంగ్లా మ్యాచ్ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన రెండు గీతాలను ఒకదాని తర్వాత మరొకటి వినే అరుదైన అవకాశం దక్కింది.

సోషల్ మీడియాలో కూడా ఇరు దేశాల జాతీయ గీతాలపై కొంత చర్చ జరిగింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్.. జనగణమన గేయాన్ని 1911లో రాయగా, బెంగాల్ విభజన సందర్భంగా 1905లో అమర్ సోనార్ బంగ్లా గీతాన్ని కూడా ఆయనే రచించారు.
ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచు జరుగుతుంటే, రెండు దేశాల జాతీయ గీతాలను రవీంద్రనాథ్ ఠాగోర్ ఎలా రాశారనే చర్చ ఫేస్బుక్లో సాగుతూ వచ్చింది. రెండు దేశాల్లో ఒక్క దేశం మాత్రమే సెమీ ఫైనల్లోకి వెళ్తుందని ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు తెలుసు కానీ అనుబంధమనేది జాతీయ గీతాల రూపంలో వ్యక్తమవుతూ వచ్చింది. ట్విట్టర్లో హల్చల్ చేస్తూ వచ్చింది. ఐదు వేలకు పైగా జాతీయ గీతం చుట్టూ ట్వీట్లు చోటు చేసుకున్నాయి. జావెద్ అక్తర్ వంటి ప్రముఖులు కూడా ఈ జాతీయ గీతంపై ట్వీట్ చేశారు.