సిడ్నీ: తమ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తాత్కాలికంగా రద్దు చేసుకుంది. హర్బజన్ పై నిషేధం ఎత్తేసే వరకు ఆస్ట్రేలియాతో తదుపరి మ్యాచులు ఆడబోమని స్పష్టం చేసింది. ఆండ్ర్యూ సైమండ్స్ పై జాతిపరమైన దూషణకు దిగాడనే ఆరోపణపై హర్బజన్ పై ఐసిసి మూడు టెస్టుల నిషేధం విధించింది. హర్బజన్ అపీల్ ను వినేవరకు పర్యటన జరగదని బిసిసిఐ స్పష్టం చేసింది. తాను ఆ విధమైన దూషణలు చేయలేదని హర్బజన్ అంటున్నాడు. మ్యాచ్ రెఫరీ నిర్ణయాన్ని సమీక్షించాలని బిసిసిఐ ఐసిసికి విజ్ఞప్తి చేయనున్నది. ఇది భారత జట్టు
గౌరవానికి, ఆ మాటకొస్తే ప్రతి భారతీయుడి గౌరవానికి సంబంధించిన విషయమని బిసిసిఐ అభిప్రాయపడింది. హర్బజన్ కు బోర్టు పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేసింది. కాన్ బెర్రాకు బయలు దేరిన భారత జట్టు సభ్యులు బిసిసిఐ సూచన మేరకు తిరిగి సిడ్నీలోని తమ హోటల్ గదులకు తిరిగి వచ్చారు. బిసిసిఐ తదుపరి సూచనల వరకు ఇక్కడి నుంచి కదలబోమని ఇండియా మీడియా మేనేయర్ ఎం.వి. శ్రీధర్ చెప్పారు.