న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా కామన్వెల్త్ క్రీడలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాత్రా మాట్లాడుతూ.. కామన్వెల్త్ క్రీడల నుంచి భారత్ శాశ్వతంగా వైదొలగాలన్నారు. కామెన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం సమయం, డబ్బు వృథా అని బాత్రా వాఖ్యలు చేశారు. బాత్రా వ్యాఖ్యలపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అధికారులు మాత్రం మద్దతుగా నిలిచారు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల నుంచి భారత్కు పతకాలను తెచ్చిపెట్టే షూటింగ్ను తొలగించడంతో ఈ క్రీడలను బాయ్కాట్ చేయాలని బాత్రా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
2015లోనే ముంబైకి ఓపెనింగ్ చేయమని రోహిత్కు సూచించా: రవిశాస్త్రి
తాజాగా బాత్రా మాట్లాడుతూ... 'కామన్వెల్త్ క్రీడల ప్రమాణాలు గొప్పగా ఏమీ లేవు. అక్కడి ఈవెంట్లలో పోటీ ఏమంత గొప్పగా ఉండదు. కాబట్టి ఆ క్రీడల నుంచి తప్పుకొని అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు భారత అథ్లెట్లు కృషి చేయాలి' అని బాత్రా వ్యాఖ్యానించారు. అయితే బాయ్కాట్ చేయాలనడంపై క్రీడా వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర క్రీడాశాఖ, సీడబ్ల్యూజీ వర్గాలు మాత్రం దీనిపై ఇప్పుడే స్పందించేందుకు నిరాకరించాయి.
బాత్రా వాఖ్యలు ఏమాత్రం సరికావని స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. 'గుండె పగిలినట్టుగా ఉంది. అథ్లెట్ల కష్టం మొత్తం బూడిదలో పోసినట్టే' అని విజేందర్ పేర్కొన్నాడు. 'ఆసియా క్రీడల కంటే కామన్వెల్త్లోనే పోటీ ఎక్కువుంటుంది' అని డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా తెలిపింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ మాట్లాడుతూ.. 'ఈ వ్యాఖ్యలు సరికాదని, దీన్ని అంగీకరించలేమని' అన్నాడు.
షట్లర్ పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ.. బాయ్కాట్ హాస్యాస్పదమన్నాడు. రెండుసార్లు స్వర్ణం గెలిచిన వెయిట్లిఫ్టర్ సతీశ్ శివలింగం బాయ్కాట్కు తాను వ్యతిరేకమన్నాడు. మరోవైపు హాకీ ఆటగాళ్లు, పలు జాతీయ క్రీడా సమాఖ్యలు కూడా బాత్రా వ్యాఖ్యలు సరికాదని ప్రకటించాయి. అయితే బాత్రా చెప్పినదాంట్లో అసత్యమేమీ లేదని ఆర్చరీ సంఘం సెక్రటరీ పరేష్ నాథ్ అన్నాడు.