కరాచీ: భారత ఏస్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఇప్పటికే 12 ప్రపంచ టైటిళ్లతో రారాజుగా వెలుగొందుతున్నాడు. తాజాగా పంకజ్ పాకిస్థాన్లో జరిగిన వరల్డ్ సిక్స్-రెడ్ స్నూకర్ టోర్నీ విజేతగా నిలిచి తనకు ఎదురేలేదని చాటాడు. దీంతో పంకజ్ అద్వానీ ఖాతాలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 13 ప్రపంచ టైటిళ్లు చేరినట్లయింది.
మంగళవారం పూర్తి ఏకపక్షంగా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ 6-2 తేడాతో యాన్ బింగ్టావో(చైనా)ను మట్టికరిపించాడు. ఆది నుంచి అద్భుత ఆటతీరుతో చెలరేగిన అద్వానీ 11 సెట్ల ఫైనల్లో తొలుత వరుస సెట్లు నెగ్గి 3-0తో ముందంజ వేశాడు. తర్వాత పుంజుకున్న బింగ్టావో వరుసగా రెండు సెట్లు నెగ్గి ఆధిక్యాన్ని 2-3కు తగ్గించాడు.
అయితే ఐదు సెట్ల అనంతరం తనదైన ఆటతీరుతో చెలరేగిన పంకజ్ ప్రత్యర్థికి కనీసం ఒక్కపాయింట్ దక్కకుండా వరుసగా రెండు సెట్లు తన వశం చేసుకున్నాడు. ఇలా అప్పటికే 5-2తో ఆధిక్యంలో ఉన్న పంకజ్ మరో సెట్ నెగ్గి ప్రపంచ టైటిల్ను తన వశం చేసుకున్నాడు.

ప్రీక్వార్టర్స్లో సింధు
జకార్త: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగుతేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. సింగిల్స్ తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో అడుగుపెట్టిన 2013, 2014 కాంస్య పతక విజేత సింధు.. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో డెన్మార్క్కు చెందిన లినే జేర్స్ఫెల్డ్పై 11-21, 21-17, 21-16తో మూడు గేముల పాటు పోరాడి గెలిచి ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ ఫారిమన్తో తలపడిన మూడో సీడ్ శ్రీకాంత్ 21-10, 21-13తో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించాడు. క్వార్టర్స్ బెర్త్ కోసం బుధవారం జరిగే పోరులో ఒలింపిక్ చాంపియన్, మాజీ నంబర్ వన్ జురుయ్ లీ (చైనా)తో 11వ సీడ్ సింధు అమీతుమీ తేల్చుకోనుంది.
ఇక శ్రీకాంత్ ప్రీక్వార్టర్స్ బెర్త్ కోసం చైనీస్ తైపీకి చెందిన సున్ జెన్ హావ్ను ఢీకొననున్నాడు. అయితే డబుల్స్లో భారత్కు నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి, మహిళల డబుల్స్లో ధన్యా నాయర్, మోహితా సహదేవ్ జోడీలు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాయి. కాగా, మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బై అందుకున్న రెండో సీడ్ సైనా నెహ్వాల్.. బుధవారం జరిగే రెండో రౌండ్లో చ్యుంగ్ నన్ యీతో తలపడనుంది.