
టోక్యో: ఆదితి అశోక్ (Aditi Ashok).. పతకానికి అతి సమీపంలో నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ గోల్ఫర్. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ట్రెండింగ్లో నిలిచింది. భారత్ ఖాతాలో మరో పతకాన్ని దాదాపు ఖాయం చేసే స్థితిలో ఉండటం దీనికి కారణం. గోల్ఫ్ ఈవెంట్లో ప్రస్తుతం ఆదితి అశోక్ మూడో స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ గోల్ఫర్ లైడియా కోతో ఈ స్థానాన్ని పంచుకుంటోన్నారు.
ఫైనల్ రౌండ్ ముగిసేలోగా ఆమె తన స్థానాన్ని ఏ మాత్రం మరింత మెరుగుపర్చుకున్నా.. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం ఖాయమౌతుంది. గోల్ఫ్ ఈవెంట్ చివరిదైన నాలుగో రౌండ్ రసవత్తరంగా కొనసాగుతోండగా.. వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. పెను తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గోల్ఫ్ ఈవెంట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫీల్డ్ నుంచి గోల్ఫర్లందరూ క్లబ్ హౌస్కు చేరుకున్నారు. వర్షం కూడా పడటం ఆరంభమైంది. కొద్దిసేపటి కిందటే ఈవెంట్ మళ్లీ ఆరంభమైంది. ఆ వెంటనే ఆదితి అశోక్ నాలుగో స్థానానికి దిగజారారు.
జపాన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12:26 నిమిషాలకు గోల్ఫ్ ఈవెంట్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఒలింపిక్స్ గోల్ఫ్ వెల్లడించింది. ఆ సమయానికి తొలి మూడు స్థానాల్లో నిలిచిన గోల్ఫర్ల పేర్లను వెల్లడించింది. మైనస్ 17తో అమెరికాకు చెందిన స్టార్ గోల్ఫర్ నెల్లి కోర్డా మొదటి స్థానంలో నిలిచారు. లోకల్ గోల్ఫర్ మోనె ఇనామీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ గోల్ఫర్ లైడియా కో, భారత గోల్ఫర్ ఆదితి అశోక్ మూడో స్థానాన్ని ఆక్రమించుకున్నారు.
లైడియా కో-ఆదితి అశోక్ మైనస్ 15తో మూడో స్థానాన్ని పంచుకుంటోన్నారు. ఈ దశలో తుఫాన్ హెచ్చరికల వల్ల గోల్ఫ్ ఈవెంట్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అదే సమయంలో వర్షం కూడా కురవడం ఆరంభమైంది. ఫీల్డ్ చిత్తడిగా మారి.. ఈవెంట్ను కొనసాగించలేని పరిస్థితి ఎదురైతే ఒలింపిక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది. మూడో స్థానంలో నిలిచిన ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తే.. భారత్కు కాంస్య పతకం లభించినట్టవుతుంది. ఒలింపిక్స్లో గోల్ఫ్ ఈవెంట్లో భారత్ తరఫున పతకం అందుకున్న తొలి గోల్ఫర్గా చరిత్ర సృష్టిస్తారు ఆదితి అశోక్.