రియో డి జనీరో: ఒలింపిక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఎన్నో ఆశలతో పాల్గొని ఓటమి నిరాశతో భారత స్ప్రింటర్ వెనుదిరిగింది. అయితే, ఆమె ఒలింపిక్స్ స్థాయిలో మరింత కఠోర శ్రమ చేయాల్సి ఉందనేది ఆమె మాటల ద్వారానే తెలుస్తోంది. ఓటమి అనంతరం 100 మీటర్ల పరుగు పందెం హీట్స్ పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.
'రాత్రి 11 గంటలకు బదులు సాయంత్రం పోటీలు పెట్టుంటే నేను మెరుగైన ప్రదర్శన చేసేదాన్ని. నా ప్రాక్టీస్ అంతా సాయంత్ర వేళలో జరిగింది. కానీ.. పోటీలు రాత్రి 11 గంటలకు జరిగాయి. పోటీ జరిగే సమయం నేను నిద్ర పోయే టైమ్. ఆ ప్రభావంతోనే రాణించలేకపోయా' అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కాగా, ద్యుతీ చేసిన వ్యాఖ్యలకు పలువురి నుంచి మద్దతు లభిస్తుండగా, మరికొందరు మాత్రం అన్ని పరిస్థితుల్లోనూ రాణించేలా సిద్దం కావాల్సి ఉంటుందని అభిప్రాపయడుతున్నారు. నిర్వాహకులు సరైన సమయపాలన చేయడం లేదని మరికొందరు ఆరోపిస్తున్నారు.

అంతేగాక, 'ఇది నా తొలి ఒలింపిక్స్ ప్రాతినిధ్యం. పోటీలో నేను ఓడినా.. అనుభవం కెరీర్లో ఉపయోగపడుతుంది. 20ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది' అని ద్యుతి పేర్కొంది.
'ఇక్కడికి వచ్చే వరకుపోటీల కోసం ఎలా సన్నద్దం కావాలో పెద్దగా అవగాహన లేదు. ఈ రోజు నాకు కలిసి రాలేదంతే. నాపై విశ్వాసం ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు. వచ్చే ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా' అని ద్యుతిచంద్ వ్యాఖ్యానించింది.
కాగా, 100మీ పరుగులో రియో ఒలింపిక్స్కి అర్హత సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ద్యుతీ.. పీటీ ఉష తర్వాత ఈ ఘనత అందుకున్న క్రీడాకారిణి కావడం గమనార్హం. దీంతో ఆమెపై అంచనాలు పెరిగిపోయాయి.
కానీ.. ఒలింపిక్స్ లో ఎనిమిది మంది పోటీ పడ్డ హీట్స్లో 100మీటర్ల పరుగును 11.69 సెకన్లలో పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది. అన్ని హీట్స్లో కలుపుకుంటే 64 మందిలో ద్యుతి 50వ స్థానంలో నిలవటం గమనార్హం. ఇప్పటివరకు తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనగా ఉన్న 11.24 సెకన్ల సమయాన్ని రియోలో మెరుగుపరుచుకోలేకపోవడం భారత్ అభిమానులకి నిరాశకు గురిచేసింది. ప్రపంచ మెగా ఈవెంట్ కోసం ద్యుతి మరింత శ్రమించాల్సి ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.