భారత క్రీడారంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పూర్తి శక్తి సామర్థ్యాలతో సన్నద్ధమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన చేసిన ప్రకటన క్రీడాలోకంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారణాసిలో ప్రారంభమైన 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2036 ఒలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ అన్ని విధాలా సిద్ధమవుతోందని ప్రధాని ప్రకటించారు. ఒలింపిక్స్కు ముందే 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని ఆయన గుర్తు చేశారు. గత పదేళ్లలో భారత్ అండర్-17 ఫిఫా వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్, ప్రధాన చెస్ టోర్నమెంట్లు వంటి 20కి పైగా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని కొనియాడారు. జనవరి 4 నుంచి 11 వరకు జరిగే ఈ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన 1,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.

వారణాసి.. క్రీడల హబ్
వారణాసిలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం ద్వారా నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా క్రీడాకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా వారణాసి ఇప్పుడు జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా మారుతోందని అధికారిక ప్రకటన వెలువడింది.