వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు అదరగొట్టింది. అత్యంత వేగంగా ఈ రేస్ను ముగించిన ఆసియా దేశంగా రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన హీట్స్-1లో భారత పురుషులు చెలరేగారు. మహమ్మద్ అనాజ్, అమోజ్ జాకబ్, మహమ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్ నలుగురూ ఉన్న బృందం అద్భుతంగా రాణించింది. ఈ టీం కేవలం 2.59.05 సెకన్లలోనే రేస్ను ముగించింది.
ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత రిలే బృందం ఇలా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, 4×400 మీటర్ల రిలేను అత్యంత వేగంగా ముగించిన ఆసియా జట్టుగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు జపాన్ బృందం పేరిట ఉండేది. జపాన్ టీం 2.59.51 సెకన్లలో ఈ రేస్ ముగించింది. ఇప్పుడు భారత బృందం ఈ రికార్డు బద్దలు కొట్టింది.

ఇక ఈ రేస్లో అమెరికా బృందం టాప్లో నిలిచింది. భారత్ రెండో స్థానం సాధించింది. మూడో స్థానంలో బ్రిటన్ బృందం నిలిచింది. అమెరికా ఈ రేస్ను 2.58.47 సెకన్లలో పూర్తి చేయడం గమనార్హం. ఇక బ్రిటన్ బృందం ఈ రేస్ను 2.59.42 సెకన్లలో పూర్తి చేసింది. ఈ మూడు టీమ్స్తో పాటు బోత్సువానా, జమైకా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ కూడా ఆదివారం ఫైనల్కు అర్హత సాధించాయి.
ఈ రేస్లో ఫైనల్కు జపాన్, జర్మనీ, బెల్జియం, శ్రీలంక, హంగేరి వంటి దేశాలు కూడా పాల్గొన్నాయి. మొత్తం 17 దేశాలు ఈ పోటీలో పాల్గొనగా.. కేవలం 8 టీమ్స్ మాత్రమే ఫైనల్కు అర్హత సాధించడం గమనార్హం. వీటిలో భారత్ రెండో స్థానం సాధించి, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. ఫైనల్లో కూడా భారత బృందం ఇదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.