అహ్మదాబాద్: శ్రీలంక, భారత్ ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచు పేలవమైన డ్రాగా ముగిసింది. భారత బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్ భారత్ ను ఘోరమైన ఓటమి ప్రమాదం నుంచి కాపాడారు. రెండో ఇన్నింగ్స్ లో గంభీర్ తో పాటు సచిన్ టెండూల్కర్ కూడా సెంచరీ సాధించాడు. సచిన్ వంద పరుగులు చేశాడు. ఇది అతనికి టెస్టు మ్యాచుల్లో 43వ సెంచరీ. కాగా, అతను టెస్టు మ్యాచుల్లో 12,812 పరుగులు సాధించాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ లో 30 వేల పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి సచిన్ టెండూల్కర్ 100 పరుగులతోనూ వివియస్ లక్ష్మణ్ 51 పరుగులతోనూ నాటవుట్ గా ఉన్నారు. లక్ష్మణ్ కు ఇది టెస్టు మ్యాచుల్లో 40వ అర్థ సెంచరీ. తొలి ఇన్నింగ్సులో భారత్ 426 పరుగులు చేయగా, శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 760 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. శ్రీలంక బౌలర్లు హెరాత్ కు రెండు వికెట్లు, వెలెగెదర, మాథ్యూస్ లకు ఒక్కటేసి వికెట్లు లభించాయి.