అహ్మదాబాద్: కబడ్డీ వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలి పోరులో కాస్తంత తడబడ్డా.. ఆ తర్వాత అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్లోకి అడుగుపెట్టింది. సొంతగడ్డపై జరిగిన సెమీస్లో థాయ్లాండ్ను చిత్తుచేసి పైనల్స్ లోకి అడుగుపెట్టింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన సెమీస్లో 73-20తో థాయ్లాండ్ను చిత్తు చేసింది.
కబడ్డీ ఆటలో తమ ఆధిపత్యానికి తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. మరోసారి వరల్డ్ కప్ను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరాన్తో శనివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. శుక్రవారం రాత్రి స్వల్ప స్కోర్లతో హోరాహోరీగా సాగిన తొలి సెమీఫైనల్లో ఇరాన్ 28-22తో కొరియాను ఓడించింది.

ఆ తర్వాత రాత్రి 9 గంటలకు భారత్ Vs థాయిలాండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఆరంభం నుంచి చెలరేగిపోయింది. సొంతగడ్డపై అభిమానుల అపూర్వ మద్దతు మధ్య ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. సూపర్ స్టార్లతో నిండిన భారత్ జట్టు థాయిలాండ్ను ఓ ఆటాడుకుంది.
అంతర్జాతీయ టోర్నీల్లో అంతగా అనుభవం లేని థాయ్లాండ్ జట్టుపై భారత్ రెచ్చిపోయింది. మ్యాచ్ మొదలైన రెండో నిమిషం నుంచే మొదలైన భారత్ పాయింట్ల జోరు ఆద్యంతం ఆఖరి దాకా కొనసాగింది. కూతకెళ్లిన ప్రతి రైడరూ పాయింట్ తేవడంతో 4 నిమిషాలకే భారత్ 5-0 ఆధిక్యంలో నిలిచింది.

వరుసగా 13 రైడ్లలో భారత్కు పాయింట్లు లభించాయి. ముఖ్యంగా స్టార్ రైడర్లు పర్దీప్ నార్వల్ (14), అజయ్ ఠాకూర్(11) సూపర్-10 ఫీట్లతో థాయ్లాండ్పై పాయింట్లు కొల్లగొట్టారు. వీరి రైడింగ్ ధాటికి స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కొరియాతో మ్యాచ్లో మినహాయిస్తే తర్వాతి ఐదు మ్యాచ్ల్లో ప్రత్యర్థికి భారత్ 20కి మించి పాయింట్లు ఇవ్వకపోవడం విశేషం.
ఆటలో ప్రథమార్ధం ముగిసేసరికే థాయిలాండ్ జట్టును మూడుసార్లు ఆలౌట్ చేసిన భారత్ 36-8తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్ధంలోనూ ఏ మాత్రం దూకుడు తగ్గలేదు. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. ఓ దశలో భారత్ స్కోరు 62-10 కావడం విశేషం.
రిజర్వ్ బెంచ్కు అవకాశమిస్తూ భారత్ వరుస పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. చివరి పది నిమిషాల్లో భారత ఆటగాళ్లు స్లోగా ఆడారు. అంతేకాదు ప్రత్యర్ధి జట్టు నుంచి ప్రతిఘటన ఎదురైంది. పోటాపోటీగా వాళ్లు కూడా పాయింట్లు సాధించారు. మ్యాచ్లో తొలిసారి చన్విత్ విచియాన్ ఒకే రైడ్లో థాయ్లాండ్కు రెండు పాయింట్లు అందించి ఆశ్చర్యపరిచాడు.
ద్వితీయార్ధంలో భారత్ మూడుసార్లు థాయిలాండ్ను ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్లో భారత్ సాధించిన మొత్తం పాయింట్లలో రైడ్ ద్వారా 42 పాయింట్లు వచ్చాయి. ట్యాకిల్ ద్వారా 18 రాగా, ఆలౌట్ ద్వారా 12 పాయింట్లు లభించాయి. సబ్స్టిట్యూట్ ఆటగాళ్లుగా బరిలోకి దిగిన నితిన్ తోమర్ (7), కిరణ్(4) రైడింగ్లో పాయింట్లతో రాణించారు.
భారత ఆటగాళ్లలో పర్దీప్ నర్వాల్ 14 పాయింట్లతో (అన్నీ రైడే) టాప్స్కోరర్గా నిలిచాడు. మరోవైపు థాయ్లాండ్ జట్టులో చాన్విట్ విచియాన్(6), కెప్టెన్ కోమ్సన్ తోంగ్కమ్(3) ఆకట్టుకున్నారు. శనివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో కూడా భారత్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది.
కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్:
భారత్ Vs ఇరాన్
రాత్రి 7. 45 నుంచి స్టార్ స్పోర్ట్స్లో