

జకార్తా: ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్.. ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న క్రీడల్లో హెప్టాథ్లాన్(ఏడు క్రీడలు కలిపి)లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా స్వప్న బర్మన్ రికార్డు సృష్టించింది.హెప్టాథ్లాన్లో 100 మీటర్ల పరుగు, హైజంప్, షాట్పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు ఉంటాయి. దవడ నొప్పి పెడుతున్నా స్టిక్కర్ వేసుకొని మరీ ఆడిన స్వప్న తన పసిడి స్వప్నాన్ని నిజం చేసుకుంది. దీనిపై స్వప్న కోచ్ శుభాశ్ సర్కార్ తొలిసారి మీడియాతో మాట్లాడారు.
స్వప్న స్వర్ణం గెలవడం వెనక తన శిక్షణ కంటే రాహుల్ ద్రవిడ్, శాయ్ ప్రోత్సాహం ఎక్కువగా ఉన్నాయని, ఆ ఖ్యాతి వాళ్లకే దక్కుతుందన్నారు.' స్వప్న పతకం గెలవడం వెనక చాలా మంది ప్రోత్సాహం ఉంది. ఆమెను నా శిక్షణ కంటే వారి మద్దతే గెలిపించింది. రాహుల్ ద్రవిడ్, శాయ్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. స్వప్న పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు ఆమె ఈ పోటీల నుంచి నిష్క్రమించాలనుకుంది. కానీ అలా చేయడం ఎవరికీ ఇష్టం లేదు. ఆ సమయంలో ఆమెకు వీళ్లందరూ అండగా నిలిచారు. కాబట్టే ఈమె తన కలను సాకారం చేసుకోగలిగింది. ఒక క్రీడాకారిణిగా ఆమె ఎంత ఆనంద పడుతుంతో, ఒక కోచ్గా నేను అంతకంటే ఎక్కువగా సంతోషిస్తున్నా' అని తెలిపారు.
హెప్టాథ్లాన్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన క్షణాల్లో.. ఆమె తల్లి బసానా ఉద్వేగానికి గురైన తీరు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది. స్వప్న పోటీని కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో లైవ్ చూసిన బసానా.. కూతురికి స్వర్ణం ఖరారవ్వగానే ఉద్వేగం ఆపుకోలేకపోయింది. బోరున ఏడ్చేసింది. పక్కకు ఒరిగిపోయింది. తర్వాత లేచి ఏడుస్తూనే ఇంటి ప్రాంగణంలో తన కోసం కూతురు కట్టించిన కాళికా మాత ఆలయానికి వెళ్లింది. సాష్టాంగపడి మొక్కింది. ఆసియా క్రీడల్లో హెప్లాథ్లాన్ స్వర్ణం నెగ్గిన స్వప్న బర్మన్కు పశ్చిమ బంగాల్ ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
పోటీలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు నుంచి స్వప్న తీవ్రమైన పంటి నొప్పితో బాధపడింది. ఒకానొక సమయంలో నొప్పి కారణంగా పోటీల నుంచి నిష్ర్కమించాలనుకుంది. నొప్పి బాధ తగ్గించుకునేందుకు బుగ్గపై ప్లాస్టర్ వేసుకుని బరిలోకి దిగింది. పంటి నొప్పిని భరిస్తూనే పోటీల్లో ఒక్కో స్థాయి దాటుకుంటూ ఫైనల్ చేరింది. ఫైనల్లో స్వర్ణం సాధించి తానెంతటి పోరాట యోధురాలో చాటి చెప్పింది.