మెల్భోర్న్: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మెల్భోర్న్లో జరిగిన మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాళ్లలో ఇద్దరు శర్మలు ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇషాంత్ శర్మ తన బౌలింగుతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను గడగడలాడిస్తే, రోహిత్ శర్మ తన సమయస్ఫూర్తితో కూడిన బ్యాటింగుతో ఆసీస్ బౌలర్లకు కొరుకుడు పడలేదు. రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమయస్ఫూర్తితో ఆచితూచి బ్యాటింగ్ చేసి భారత్ కు సునాయస విజయాన్ని అందించారు. వీరిద్దరు 58 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. రోహిత్ శర్మ 39 పరుగులు చేసి నాటవుట్ గా మిగలగా ధోనీ 17 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ తన సీనియారిటీని మరోసారి నిరూపించుకున్నాడు. టెండూల్కర్ 44 పరుగులు చేశాడు. సెహ్వాగ్ 11 పరుగులు చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 18 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 3 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ రెండు వికెట్లు తీయగా, బ్రెట్ లీ, క్లార్క్, బ్రేకన్ లకు ఒక్కటేసి వికెట్లు లభించాయి.
భారత బౌలర్లు ఇషాంత్శర్మ, శ్రీశాంత్లు విజృంభించడంతో 43.1 ఓవర్లలో 159 పరుగులకే ఆస్ట్రేలియా కుప్పకూలింది. చెలరేగిన ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. శ్రీశాంత్ మూడు వికెట్లతో తనవంతు సహకారాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో హస్సీ(65 నాటౌట్) ఓక్కడే అర్ధ సెంచరీ సాధించగా, ఓపెనర్ హేడెన్ (25), సైమండ్ (14), క్లార్స్(11)లు మాత్రమే కాస్త ప్రతిఘటించగలిగారు. బ్రెట్లీ (10), పాంటింగ్ (9), హెడెన్ (5), జాన్సన్ (3), బ్రాకెన్ (1), గిల్క్రిస్ట్ (0), క్లార్క్ (0)లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (4), శ్రీశాంత్ (3)లతో పాటు పఠాన్ రెండు, హర్భజన్ ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాను శ్రీశాంత్ తొలిదెబ్బ తీసాడు. ఆస్ట్రేలియా స్కోరు ఒక్క పరుగు వద్ద విద్వంసకర బ్యాట్స్మెన్ ఓపెనర్ గిల్క్రిస్ట్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే శ్రీశాంత్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. తర్వాత శర్మ బౌలింగ్లో ధోనీ పట్టిన క్యాచ్తో హేడెన్ (25) వెనుతిరిగాడు. ఆ తర్వాత శర్మ బౌలింగ్లోనే సచిన్ పట్టిన క్యాచ్తో పాంటింగ్ (9) సైతం వెనుతిరిగాడు. క్లార్క్ (11)ను పఠాన్ పెవిలియన్ చేర్చగా, శర్మ బౌలింగ్ మాయాజాలానికి సైమండ్స్ (14) క్రీజు నుంచి నిష్క్రమించాడు. బౌలర్ హడిన్ (5)ను హర్భజన్ బోల్తా కొట్టించాడు. తర్వాత బ్రెట్లీ (10)ని పఠాన్ పెవిలియన్ చేర్చగా, జాన్సన్ (3), బ్రాకెన్ (1)లను శ్రీశాంత్ అవుట్ చేశాడు. చివరగా క్లార్క్ (0)ను శర్మ అవుట్ చేయడంతో 159 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా 160 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచగలిగింది.