
హైదరాబాద్: మరో క్రీడా సంరంభానికి వేళైంది. ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత జట్టును ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) మంగళవారం ప్రకటించింది. 524 మంది క్రీడాకారులు ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో నిర్వహించే ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పాల్గొననున్నట్లు తెలిపారు. వీరిలో 277 మంది పురుషులు కాగా 247 మంది మహిళలు. మొత్తం 36 విభాగాల్లో భారత ఆటగాళ్లు పోటీ పడనున్నారు.
ఈ సందర్భంగా ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా మాట్లాడుతూ... 'ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి 524 మంది పాల్గొననున్నారు. వీరందరికీ నా శుభాకాంక్షలు. 2020 టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని ఆసియా గేమ్స్కు ఆటగాళ్లను ఎంపిక చేశాం. జూన్లో ఆసియా క్రీడల కోసం ఆటగాళ్లు, వారితో పాటు వెళ్లే అధికారులతో కూడిన మొత్తం 2,370 మంది జాబితాను మంత్రిత్వ శాఖకు పంపించారు. ఇందులో 524 మంది ఆటగాళ్లకు ఆమోదం లభించింది' అని రాజీవ్ తెలిపారు.