భారత్ నుంచి ఆసియన్ గేమ్స్కు 524మంది ఆటగాళ్లు

హైదరాబాద్: మరో క్రీడా సంరంభానికి వేళైంది. ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత జట్టును ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) మంగళవారం ప్రకటించింది. 524 మంది క్రీడాకారులు ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో నిర్వహించే ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పాల్గొననున్నట్లు తెలిపారు. వీరిలో 277 మంది పురుషులు కాగా 247 మంది మహిళలు. మొత్తం 36 విభాగాల్లో భారత ఆటగాళ్లు పోటీ పడనున్నారు.
ఈ సందర్భంగా ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా మాట్లాడుతూ... 'ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి 524 మంది పాల్గొననున్నారు. వీరందరికీ నా శుభాకాంక్షలు. 2020 టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని ఆసియా గేమ్స్కు ఆటగాళ్లను ఎంపిక చేశాం. జూన్లో ఆసియా క్రీడల కోసం ఆటగాళ్లు, వారితో పాటు వెళ్లే అధికారులతో కూడిన మొత్తం 2,370 మంది జాబితాను మంత్రిత్వ శాఖకు పంపించారు. ఇందులో 524 మంది ఆటగాళ్లకు ఆమోదం లభించింది' అని రాజీవ్ తెలిపారు.
ఈ ఆసియన్ గేమ్స్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బౌలింగ్, కానొయ్-కాయాక్(స్ప్రింట్), సైక్లింగ్, ఈక్డిస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, గోల్ఫ్, హ్యాండ్బాల్, హాకీ, జుడో, కబడ్డీ, కరాటే, కురాష్, పెంకాక్ సిలాట్, రోలర్ స్కేటింగ్, రోయింగ్, సైలింగ్, సాంబో, సెపాక్తక్రావ్, షూటింగ్, స్క్వాష్, ఆక్వాటిక్స్-స్విమ్మింగ్, ఆక్వాటిక్స్-డైవింగ్, టెన్నిస్, తైక్వాండో, ట్రిథ్లోన్, సాఫ్ట్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ అండ్ వుషూ ఇలా పలు విభాగాల్లో క్రీడాకారులు తమ సత్తా చాటనున్నారు.
2014లో జరిగిన ఆసియా క్రీడలకు భారత్ నుంచి 541 మంది ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఎన్నడూ పాల్గొనని ఎనిమిది క్రీడాంశాల్లో ఈ సారి భారత్ పాల్గొననున్నట్లు ఐఓఏ తెలిపింది. అవి... కరాటే, క్యురాష్, పెన్కాక్ సైలట్, రోలర్ స్కేటింగ్, శాంబో, సెపక్ తక్రా, ట్రయల్థాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications