పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని, తమ దేశం జెండా సగర్వంగా ఎగురవేయాలని ప్రతి క్రీడాకారుడు గొప్పగా పోరాడుతుంటాడు.
ఈసారి చేజారితే జీవితంలో మరోసారి పతకం దక్కదనే రీతిలో ఆడుతుంటారు. ప్రేక్షకులు ఇది అతిగా అనిపించినా, ఆటగాళ్ల పరంగా ఇది సాధారణం విషయమే. అయితే ఓ క్రీడాకారుడు ఒలింపిక్స్లో పాల్గొనాలని ఎవరూ ఊహించని త్యాగం చేశాడు. పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని, గాయపడిన వేలు తొలగించుకున్నాడు. దేశం కోసం విశ్వక్రీడల్లో పోరాడాలని ఈ సాహసం చేశాడు.

అతనే ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ మాట్ డాసన్. టోక్యో ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా రజతం సాధించిన జట్టులో డాసన్ సభ్యుడు కూడా. ఈ సారి జట్టుతో కలిసి స్వర్ణం సాధించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అయితే వేలు తొలగించడాన్ని మొదట తన భార్య అంగీకరించలేదని మాట్ డాసన్ చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆమెకి నచ్చజెప్పానని తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్తో పాటు భవిష్యత్లో కూడా సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని డాసన్ వివరించాడు.
కాగా, పారిస్ ఒలింపిక్స్ ఒకే పూల్లో భారత్, ఆస్ట్రేలియా ఉన్నాయి. పూల్-బీలో భారత్, ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్లో భారత్ కాంస్యం నెగ్గిన విషయం తెలిసిందే. ఈ విశ్వక్రీడల్లో జులై 27న న్యూజిలాండ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరతాయి.