న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లే భారత అథ్లెట్లను బిజినెస్ క్లాస్లో పంపాలని, భోజన భత్యాలను రెండింతలు పెంచాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా కోరాడు. ఇటీవల అర్జెంటీనాలో ముగిసిన యూత్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను ఐఓఏ సత్కరించింది. పసిడి నెగ్గిన అథ్లెట్లకు రూ.3 లక్షలు, రజతానికి రూ.1.5 లక్షలు, కాంస్యానికి రూ.1 లక్ష నగదు బహుమతి అందజేసింది.
'అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లేటపుడు అధికార ప్రతినిధులేమో విలాసవంతమైన బిజినెస్ క్లాస్లో వెళ్తుంటే.. అథ్లెట్లు సాధారణ తరగతిలో ప్రయాణిస్తున్నారు. మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టే ఏ ప్రయాణానికైనా అథ్లెట్లను బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరుతున్నా. ఇలాంటి వసతి కల్పించడంతో పాటు భోజన భత్యాలను రూ.450 నుంచి రూ.1000కి పెంచితే మన అథ్లెట్లు కచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈ విషయంపై క్రీడా మంత్రి తొందర్లోనే స్పందిస్తారని అనుకుంటున్నా'అని రాజీవ్ తెలిపాడు.
అథ్లెట్లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందని మంత్రి రాజ్యవర్థన్ సింగ్ చెప్పారు. 'ప్రధాని తీరికలేకుండా ఉన్నా కూడా వీలు చేసుకొని ఉదయం మిమ్మల్ని కలిశారు. ఆయనకు మీరెంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. కేవలం 2020 ఒలింపిక్స్ కోసమే కాకుండా ఆ తర్వాతి ఒలింపిక్స్ కోసం కూడా దృష్టి సారించాం. యూత్ ఒలింపిక్స్లో సత్తాచాటిన అథ్లెట్లు అదే నిబద్ధతతో మరింత సాధన చేసి ఉన్నత లక్ష్యాలను అందుకొనే దిశగా అడుగులు వేయాలి' అని రాఠోడ్ పిలుపునిచ్చారు.
యూత్ ఒలింపిక్స్ పతకం అనేదే టార్గెట్ కాదు. అంతకుమించి సాధించేందుకు మేం పోరాడుతున్నాం. కొందరు సాధించకపోవచ్చు. కానీ, పతకాలను గెలిచేదిశగా అందరం కష్టపడతాం. ఒలింపిక్స్లో పతకం సాధించడం దేశానికే గర్వకారణం' అంటూ ఒలింపిక్స్ వెండి పతక విజేత ఒకరు పేర్కొన్నారు. కామన్వెల్త్, యూత్ ఒలింపిక్స్లోనూ క్రీడాకారులు రాణించేందుకు క్రీడా మంతి రాజ్యవర్దన్ సింగ్ ఎంతో కృషి చేశారు.