హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో ఆగష్టు 18 నుంచి సెప్టెంబరు 2వరకూ జరగనున్న ఆసియా క్రీడలకు విన్నేశ్ ఫొగట్ సిద్ధమైంది. ఈ ఈవెంట్లతో పాటు ఒలింపిక్స్ క్రీడల్లోనూ రాణించాలని తదనుగుణంగా సూచనలందిస్తోంది. ఒలింపిక్స్లో భారత్ పతకం సాధించాలంటే మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలని రెజ్లర్ విన్నేశ్ పొగట్ కోరింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ముందు విన్నేశ్ లఖ్నవూలో శిక్షణ పొందింది. క్రీడాకారులు శిక్షణ పొందిన అకాడమీలోని సదుపాయాల పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రాక్టీస్ చేసే సమయంలో కరెంటు సరిగ్గా ఉండేది కాదని, ప్రాక్టీస్ హాల్ చాలా వేడిగా ఉండేదని తెలిపింది. 'ఇప్పుడు ఆసియా క్రీడలు... ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్. దీంతో వరుసగా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్నాం. లఖ్నవూలోని అకాడమీలో శిక్షణ పొందాం. గతంతో పోలిస్తే శిక్షణ కేంద్రాల వద్ద క్రీడాకారులకు ఇచ్చే ఆహారంలో నాణ్యత పెరిగింది. కానీ, మారాల్సినవి ఇంకా ఉన్నాయి. ఒలింపిక్స్లో భారత్కు పతకం రావాలని కోరుకుంటే ముందుగా మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య శిక్షణ పొందుతున్నాం.'
'దీంతో ఒక్కోసారి గాయల బారిన పడుతున్నాం. లక్నోలోని రెజ్లింగ్ హాల్ చాలా వేడిగా ఉంటోంది. వర్షాకాలంలో కూడా ఇంత వేడిగా ఉండటం దురదృష్టకరం. కొన్నిసార్లు కరెంటు ఉండదు. దీంతో ట్రైనింగ్ సెషన్కు దూరం కావాల్సి ఉంటోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య సదుపాయాలు కల్పిస్తోంది. కానీ, ప్రముఖ టోర్నీలకు వెళ్లే ముందు ఆటగాళ్ల ట్రైనింగ్ సెషన్లో ఇలా నిర్లక్ష్యం వహించకూడదు' అని విన్నేశ్ తెలిపింది.
ఇటీవల ఆసియా క్రీడలకు వెళ్లనున్న క్రీడాకారులకు ఖర్చులన్నీ మేమే భరిస్తామని తెలిపిన క్రీడా మంత్రిత్వ శాఖ.. తమ నిర్ణయాన్ని మారుస్తూ.. 'కేవలం 755 మందికి మాత్రమే ఖర్చులు భరిస్తాం. మిగిలిన 49 మందికి మాకూ ఎటువంటి సంబంధం లేదు.' అని వెల్లడించింది. ఈ నెల 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. దీని గురించి విన్నేశ్ మాట్లాడుతూ.. 'జపాన్, చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్లు బరిలో ఉన్నారు. నా వ్యూహాలతో నేను బరిలోకి దిగుతున్నా' అని చెప్పింది.