
హైదరాబాద్: తనకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలపై గోల్డ్కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు స్వర్ణ పతకం అందించిన 16 ఏళ్ల మను బకర్ స్పందించింది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆమె స్వస్థలమైన చర్ఖి దాద్రి పట్టణంలో పతకాలు గెలిచిన క్రీడాకారులను మంగళవారం హర్యానా ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
అయితే, ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న 16 ఏళ్ల మనూ బకర్కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఫోగట్ ఖప్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మనూను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించారు. పూల దండలతో కూర్చీ మీద కూర్చున్న మను బకర్.. ఆ తర్వాత అతిథుల రాకతో వాళ్ల కాళ్ల దగ్గర నేల మీద కూర్చోవాల్సి వచ్చింది.
దీంతో మను బకర్కు అవమానం జరిగిందంటూ టైమ్స్ నౌలో వార్త రావడంతో మను బకర్ స్పందించింది. మీరేదో ఊహించుకుని వార్తలు రాయడం సరికాదని ఆమె టైమ్స్ నౌను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 'నాకు ఏ అవమానం జరగలేదు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దల్ని గౌరవించి నేను కింద కూర్చున్నాను. దానికి ఎందుకు అంత ప్రాధాన్యం.. పెద్దల్ని గౌరవించడం తప్పా?' అని ప్రశ్నించింది.
మరోవైపు ఈ ఘటనపై మను బకర్ తండ్రి రామ్ కిషన్ మాట్లాడుతూ 'మనుకు ఎలాంటి అవమానం జరగలేదు. అది సంప్రదాయంలో భాగమే. ఇది తమకు అవమానం కాదని, పెద్దలపట్ల ఉన్న గౌరవంతో తన కూతురే లేచి కింద కూర్చుంది. ఆమె తన చర్యతో పెద్దల్ని గౌరవించడం పట్ల యువతకు ఒక సందేశాన్నిచ్చింది. దీన్ని అనవసరంగా రాద్దాంతం చేయొద్దు' అని అన్నాడు.

పాల్గొన్న తొలి కామన్వెల్త్ గేమ్స్లోనే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మను బకర్ స్వర్ణం నెగ్గింది. ఎయిర్ పిస్టల్ షూటింగ్లో 240.9 పాయింట్లు (కామన్వెల్త్ గేమ్స్ రికార్డు) సాధించి రికార్డుని సృష్టించింది. చర్ఖి దాద్రి పట్టణంలో ఫోగట్ కాప్ పంచాయతీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రెజ్లర్లు వినేష్ ఫోగట్, బబిత కుమారిలను కూడా సన్మానించారు.