న్యూఢిల్లీ: ఒలింపిక్స్కు వెళతానని, ఆ మెగా ఈవెంట్లో పాల్గొంటానని తాను అన్నప్పుడు అంతా తనను పిచ్చోడన్నారని భారత షూటర్, ఒలింపిక్స్ రజత పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నాడు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. ఒలింపిక్స్కు వెళ్లడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేశానన్నాడు.
ఆ సమయంలో ఎవరూ తన మాట నమ్మలేదని, పైగా పిచ్చోడిగా పరిగణించారని అన్నాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో పాల్గొనడం, రజత పతకం సాధించడంతో తన కల నెరవేరిందని తెలిపాడు. ఇండివిజువల్ ఈవెంట్లో రజత పతకాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెకలొల్పడం తన అదృష్టమన్నాడు.

ఎవరేమనుకున్నా, లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉండి, నిరంతరం కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనని అన్నాడు. తనకు ఆటలు ఆడుతున్న రోజులు గుర్తుకు వస్తున్నాయని, క్రీడాకారులను గుర్తించే ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన అన్నారు.
జైసల్మీర్లో జన్మించిన రాథోడ్ కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో, ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.