న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న ప్రొఫెషనల్ బౌట్లో భారత స్టార్ విజేందర్ సింగ్తో తలపడనున్న బల్గేరియా బాక్సర్ సామెట్ హ్యూసెనోవ్ తన మాటలతో బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. డిసెంబర్ 19న మాంచెస్టర్(అమెరికా) వేదికగా జరిగే బౌట్లో విజేందర్ ఎముకలు విరగొట్టి భారత్కు పంపిస్తానని ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేసిన సామెట్.. తన చేతిలో అతనికి ఓటమి తప్పదని మరోసారి హెచ్చరించాడు.
ఇందులో సందేహమే అక్కర్లేదని స్పష్టం చేస్తున్నాడు. 'విజేందర్ అమెచ్యూర్లో సక్సెస్ఫుల్ బాక్సర్. కానీ ప్రొఫెషనల్గా ఇప్పుడిప్పుడే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అతను నాకు పోటీ ఇస్తాడని అస్సలు అనుకోవడం లేదు' అని సామెట్ పేర్కొన్నాడు.
అంతేగాక, 'ఆరోజు బౌట్లో కచ్చితంగా విజేందర్ అభిమానులు నిరాశకు గురవక తప్పదు. సారీ ఇండియా.. మీవాడు (విజేందర్) ఓడిపోతున్నందుకు' అని 29ఏళ్ల సామెట్ అన్నాడు. అంతేగాక, తాను అతనికి ప్రమాదకరమైన ప్రత్యర్థిని అని చెప్పాడు. అతను ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రత్యర్థులతో తనను పోల్చుకోవద్దని తెలిపాడు.

కాగా, ఇటీవల సామెట్ చేసిన బెదిరింపులకు ఓ నవ్వు నవ్వి వూరుకున్నాడు మన బాక్సర్ విజేందర్. అతను మాట్లాడుతూ... సామెట్కి ఎలా సమాధానమివ్వాలో తనకు తెలుసన్నాడు.
ఇలాంటి బెదిరింపులకు నేను నవ్వి వూరుకుంటానని, ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఉందని, నేను మాత్రం రింగ్లోనే సమాధానమిస్తానని, అదీ అతడికి బాగా అర్థమయ్యే భాషలో ఇస్తానన్నాడు. హ్హ్యూసెనోవ్ ప్రొఫెషనల్గా అనుభవం ఉండొచ్చనని, కానీ తానేమి తక్కువ కాదన్నాడు. తాను ఒలింపిక్స్ పతక విజేతనని చెప్పాడు.