చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఉత్కంఠగా చూసే క్రీడల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఒకటి. ఈ షోలో పాల్గొనే రెజ్లర్లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి సూపర్ స్టార్లు హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టనున్నారు. హైదరాబాద్ ప్రజలకు మరో కొత్త అనుభూతిని పంచేందుకు వీళ్లంతా వచ్చేస్తున్నారట.
ప్రపంచ ప్రఖ్యాత డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఈ పోటీ భారత్లో అడుగు పెడుతోంది. సెప్టెంబర్ 8న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్స్టార్ స్పెక్టేకిల్ ప్రోగ్రాం ఇక్కడ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆవిష్కరించారు.

హైదరాబాద్లో జరిగి ఈ షోలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. భారత్లో ఈ షో జరగడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. హైదరాబాద్లో జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్లో ప్రస్తుత వరల్డ్ హెవీవైట్ ఛాంపియన్ సేత్ 'ఫ్రీకిన్' రోలిన్స్ కూడా పాల్గొంటాడట.
అతనేకాదు మహిళల వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లే, డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీం ఛాంపియన్లు సామి జాయన్, కెవిన్ ఓవెన్స్.. వీరితోపాటు ఫ్యాన్ ఫేవరెట్లు జిందర్ మహల్, డ్రూ మెకింటైర్, బెక్కీ లించ్, నటాల్యా, మ్యాట్ రిడిల్, లూడ్విగ్ కైసర్ తదితరులు హైదరాబాద్కు వస్తున్నట్లు సమాచారం. ఈ షోకు సంబంధించిన టికెట్లను బుక్మైషో యాప్ లేదా www.bookmyshow.com వెబ్సైట్లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
ఈ వార్త విన్న డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. తమ అభిమాన రెజ్లర్లను నేరుగా చూసే అవకాశం దక్కడం తమ అదృష్టం అంటున్నారు. తాము కచ్చితంగా ఈ షో చూసేందుకు వస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్లో ఈ వార్త జోష్ నింపిందనే చెప్పాలి.