
హైదరాబాద్: కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఓ సరికొత్త ఛాలెంజ్ను తెరపైకి తీసుకొచ్చారు. భారతీయులు ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశ్యంతో 'హమ్ ఫిట్తో ఫిట్ ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాథోడ్ తన కార్యాయలంలోనే 10 డిప్స్ కొడుతూ షూట్ చేసిన వీడియోను సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు. ఆయన చేసిన ఛాలెంజ్ను బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్ స్వీకరించారు.
'ప్రధాని నరేంద్ర మోడీ హార్డ్వర్క్, అతని శక్తి చూసి నేను స్ఫూర్తి పొందాను. భారత్దేశ ప్రజలంతా ఫిట్గా ఉండాలని మోదీ అభిలాష' అందుకే ఈ ఛాలెంజ్ అని రాథోడ్ తెలిపారు. 'ఫిట్గా ఉండేందుకు నేను రోజూ నడుస్తాను, సైక్లింగ్, జాగింగ్ చేస్తాను. ప్రతిరోజూ ఆఫీస్కు సైకిల్పై వెళ్తాను' అని పేర్కొన్న హృతిక్ తాను సైక్లింగ్ చేసే వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
అలాగే సైనా నెహ్వాల్ కూడా ఫిట్నెస్ కసరత్తులు చేసే వీడియోను పంచుకుంది. 'ఈ ఛాలెంజ్కు నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్స్ సర్. ఇలా కసరత్తులు చేసి నేను ఫిట్గా ఉంటున్నాను. ఇప్పుడు నేను మరో సినీ నటుడు రానా దగ్గుబాటి, గౌతం గంభీర్, పీవి సింధులను ఛాలెంజ్ చేస్తున్నాను.' అని సైనా నెహ్వాల్ ట్విట్టర్ ద్వారా వీడియోను పోస్టు చేసింది.
గతంలోనూ ఇదే తరహాలో అందరిలోనూ చైతన్యం తేవడానికి ప్యాడ్ మాన్ ఛాలెంజ్ అంటూ.. ప్రముఖ సినీ తారల దగ్గర్నుంచి విరాట్ కోహ్లీ లాంటి క్రీడాకారులు కూడా ఛాలెంజ్ను స్వీకరించి సోషల్ మీడియా ద్వారా పెద్ద స్థాయిలో చర్చనే లేపారు.