భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో రౌండ్-16కు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్ ప్లేయర్ ప్రితికా పవడేపై ఘన విజయం సాధించి ఈ ఘనత అందుకుంది.
రౌండ్-32లో భాగంగా జరిగిన ఈ పోరులో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రితికాపై మనికా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా నాలుగు సెట్లలో విజయఢంకా మోగించింది. 11-9, 11-6, 11-9, 11-7తో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న మనికా ఆ తర్వాత మరింత విజృంభించింది. ప్రితికాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రిక్వార్టర్స్కు చేరుకుంది.

కాగా, ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ మియూ హిరానో లేదా హాంకాంగ్ ప్లేయర్ జు చెంగ్జూతో మనికా బత్రా తలపడనుంది. ''పారిస్ విశ్వక్రీడల్లో ఫ్రెంచ్ ప్లేయర్ను ఓడించడం సంతోషంగా ఉంది. అంతేగాక నా కంటే మెరుగైన ర్యాంక్పై పైచేయి సాధించాను. రికార్డులు, ప్రిక్వార్టర్స్కు చేరిన ఘనత గురించి ఆలోచించట్లేదు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. మ్యాచ్ మ్యాచ్గా ఆలోచించి ఉత్తమ ప్రదర్శన చేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాను'' అని మనికా పేర్కొంది.
ప్రత్యర్థి ప్రితికా ఫ్రెంచ్ ప్లేయర్ అయినప్పటికీ, భారత సంతతికి చెందినదే. ఆమె తల్లిదండ్రులు గతంలో పుదుచ్చేరిలో ఉండేవాళ్లు. 2003లో ఫ్రాన్స్కు వెళ్లారు. కాగా, 19 ఏళ్ల ప్రితికా 18వ ర్యాంక్. మన ప్లేయర్ మనికా 28వ ర్యాంక్. 29 ఏళ్ల మనికాకు ఇది మూడో ఒలింపిక్స్.