
పొలమే ఆమెకు తొలి ట్రాక్
తండ్రి రైతు కావడంతో పొలమే ఆమెకు తొలి ట్రాక్ అయింది. బురద, ఎత్తు పల్లాలతో ఉండే నేలపై పరుగెత్తి పరుగెత్తి రాటుదేలింది. ఎంతటి దూరాన్నయినా అలుపు లేకుండా పూర్తిచేసే శక్తిని ఆమె సంతరించుకుంది. అయితే స్కూల్లో మాత్రం ఫుట్బాల్ ఆడేది. స్ట్రయికర్గా పాఠశాల జట్టుకు ఆమె ఎన్నో విజయాలు అందించింది. కానీ స్కూల్ కోచ్.. ఆమె రన్నింగ్లో ప్రవేశిస్తే తిరుగుండదని భావించాడు. అలా ఫుట్బాల్ నుంచి హిమ ‘ట్రాక్'వైపు మళ్లింది.

400 మీ. పరుగులో అయితే ఇంకా బెటర్
2016లో ఓ రాష్ట్రస్థాయి టోర్నీ సందర్భంగా హిమాదాస్లో ప్రతిభను నిపన్ దాస్ గుర్తించాడు. ఇంకా ఊరిలో ఉంటే ఆమె ప్రతిభ మరుగున పడిపోతుందని గ్రహించిన ఆయన వెంటనే ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి హిమను సరుస జాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హాస్టల్లో చేర్పించాడు. 100 మీ., 200 మీ.లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించిన హిమను.. నిపన్, అతడి సహకోచ్ నవజీత్ 400 మీ. పరుగులో అయితే ఇంకా బెటర్ అని భావించి ఈ విభాగంలోకి మార్చారు.

చివరి 150 మీటర్లలో వాయు వేగంతో
‘హిమలో మంచి స్పీడ్, అందుకు తగ్గ శక్తి ఉందని గ్రహించాం. 200 మీ.లలో ఆమె బాగానే రాణించింది. కానీ వేగమే సరిపోలేదు. కానీ చివరి 150 మీటర్లలో వాయు వేగంతో పరుగెత్తుతుండడంతో 400 మీ.లలో ఆమెకు తిరుగుండదని భావించాం. అంతేకాదు 400 మీ. రిలేలోనూ హిమ సత్తా చాటుతుందని అంచనా వేశాం. అలా 400 మీ.లలో ఆమె కెరీర్కు మెరుగులుదిద్దాం' అని నిపన్ వివరించాడు.

మహిళా అథ్లెట్లు బాలురతో ప్రాక్టీస్ చేస్తా
ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ పెద్దటోర్నీల ముంగిటే కొందరు మహిళా అథ్లెట్లు బాలురతో ప్రాక్టీస్ చేస్తారు. కానీ, హిమదాస్ మాత్రం ప్రతిరోజు వారితో ప్రాక్టీస్ చేసేందుకు ఇష్టపడేది. వారిని అధిగమించాలనే తపనతో పరుగెత్తడంతో హిమదాస్ వేగం పెరిగింది. కాగా 400 మీ.లలో హిమ వ్యక్తిగత అత్యుత్తమం 51.13 సెకన్లు. గువాహటిలో గత నెలలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో ఆ సమయం నమోదు చేసింది.

100, 200మీ.లలో స్వర్ణ పతకాలు
అండర్-20 వరల్డ్ చాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు సీమా పునియా (డిస్కస్ త్రో- కాంస్యం), నవజీత్ కౌర్ థిల్లాన్ (డిస్కస్ త్రో- కాంస్యం), నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో-స్వర్ణం) సరసన చేరింది. వాస్తవంగా కొద్దికాలం కిందటి వరకూ హిమకు స్పైక్స్ అంటే తెలీదు. ఇప్పటికీ ఆమె వేసుకొనేది కూడా తక్కువ ఖరీదు స్పైక్స్. అయినా 100, 200మీ.లలో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. అందుకే.. అంతటి ప్రతిభ కలిగిన అథ్లెట్ను తన కెరీర్లో చూడలేదంటాడు నిపన్.

పోటీకి ముందు కోచ్ నిపన్దాస్కు మాటిచ్చి:
ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ వరల్డ్ అండర్-20 చాంపియన్షిప్స్ 400 మీటర్ల రేసులో చాంపియన్గా నిలిచి పోటీకి ముందు కోచ్ నిపన్దాస్కు ఇచ్చి మాటను నిలబెట్టుకుంది హిమదాస్. రేస్ చివరి 80 మీటర్ల వరకూ రుమేనియా అథ్లెట్ ఆండ్రియా మిక్లోస్ ముందుంది. సరిగ్గా ఆ దశనుంచే చిరుతలా పరిగెత్తింది దాస్. ఫలితంగా రేస్ ముగిసేసరికి (51. 46 సెకన్లు) ఫస్ట్ప్లేస్లో నిలిచింది. ట్రాక్ ఈవెంట్లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం గెల్చిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర సృష్టించింది.

పతకం కాదు.. అందుకే ఏడ్చా:
‘ఈ చాంపియన్షిప్లో భారత జాతీయ గీతం వినిపించాలని ఇక్కడకు వచ్చే ముందు గట్టిగా అనుకున్నా. అది నిజమైనందుకు ఆనందంతో ఏడ్చేశా. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కోచ్లు, నేను విజయం సాధించాలని ఆశీర్వదించిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు' అని చెప్పింది. ‘ఆసియా క్రీడల్లో అత్యుత్తమంగా రాణిస్తా. అయితే పతకం కోసం కాకుండా టైమింగ్ను మెరుగుపరుచుకోవడానికే ప్రయత్నిస్తా' అని తన ఆమె ప్రకటించింది.


Click it and Unblock the Notifications












