South Asian Body Building: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన హిలాంగ్ యాజిక్ చరిత్ర సృష్టించారు. ఆమె భూటాన్లోని థింపూలో జరిగిన 15వ సౌత్ ఏషియన్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో స్వర్ణపతకం సాధించారు. ఆమె మహిళల మోడల్ ఫిజిక్(155 సెం.మీ వరకు) విభాగంలో స్వర్ణ పతకం, మరొక విభాగంలో రజత పతకం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన మొదటి మహిళా అథ్లట్ హిలాంగ్ యాజిక్. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్లో ఫిజిక్ స్పోర్ట్స్లో అరుణాచల్ నుంచి స్వర్ణ పతకం సాధించిన తొలి అథ్లెట్ కూడా. ఈ ఛాంపియన్షిప్ జూన్ 11 నుంచి 15 వరకు థింపూలో జరిగింది.
ప్రశంసించిన అరుణాచల్ ముఖ్యమంత్రి
బాడీ బిల్డింగ్లో స్వర్ణ పతకం సాధించిన హిలాంగ్ యాజిక్ను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రశంసించారు. అరుణాచల్ సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. "భూటాన్లోని థింపూలో జరిగిన 15వ దక్షిణాసియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో హిలాంగ్ యాజిక్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఆమె స్వర్ణ పతకం, రజత పతకం గెలిచ ఫిజిక్ స్పోర్ట్స్లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించి అరుణాచల్ నుంచి వచ్చిన మొదటి మహిళగా గౌరవం పొందారు. ఆమె నిజంగా ఒక ఆదర్శం. హిలాంగ్ యాజిక్ పట్టుదల, క్రమశిక్షణ, సంకల్పం అరుణాచల్ ప్రదేశ్కు, దేశం మొత్తానికి గర్వించదగిన కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. హిలాంగ్, మీకు మరిన్ని శక్తులు లభించుగాక.' అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేర్కొన్నారు.

హిలాంగ్ యాజిక్ను ప్రశంసించిన కిరణ్ రిజిజు
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా హిలాంగ్ యాజిక్ను ఎంతగానో ప్రశంసించి ఆమెకు అభినందనలు తెలిపారు. కిరణ్ రిజిజు తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేస్తూ.."భూటాన్లోని థింపూలో జరిగిన 15వ దక్షిణాసియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్కు చెందిన హిలాంగ్ యాజిక్ ఒక స్వర్ణ పతకం, ఒక రజత పతకం గెలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన హిలాంగ్ యాజిక్ చరిత్ర సృష్టించారు. హిలాంగ్ యాజిక్కు నా హృదయపూర్వక అభినందనలు!" అని పేర్కొన్నారు. సౌత్ ఏషియన్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను భూటాన్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహించింది.