జోహన్నెస్బర్గ్: ఎప్పుడూ వివాదాలతో మీడియాలో ఉండే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్ష్లీ గిబ్స్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈసారి ఫూటుగా మద్యం సేవించి.. అతివేగంగా వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అతిగా మద్యం సేవించి వాహనాన్ని నడపడమే కాకుండా.. మరో కారును ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, మద్యం సేవించి వాహనాన్ని అతివేగంగా నడిపినందుకు గిబ్స్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్ట్ చేశారు.
కాగా, గిబ్స్ మద్యం సేవించి వాహనం నడుపడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు 2008 మార్చిలో కూడా కేప్టౌన్ నగరంలోనే అతిగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. అప్పుడు కూడా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో 2009లో డ్రగ్స్, మద్యం అలవాట్ల నుంచి బయటపడేందుకు రిహబిలిటేషన్ కోర్సులో చేరాడు. అయితే దాని ఫలితం అతనిపై ఈ ఘటనతో తేలిపోయినట్లయింది. 2000 సంవత్సరంలో ఇండియాలో జరిగిన మ్యాచులో ఫిక్సింగ్కు పాల్పడినట్లు గిబ్స్పై ఆరోపణలున్నాయి.
గిబ్స్ 90 టెస్టులు, 248 వన్డేలు, 23ట్వంటీ మ్యాచులు ఆడాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తన చుట్టూ నెలకొన్న వివాదాలపై ఓ పుస్తకం కూడా పబ్లిష్ చేశాడు గిబ్స్. ఆ పుస్తకాలు కూడా బాగానే అమ్ముడయ్యాయి.