
హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం వినియోగిస్తారు. భారత్లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్కు కూడా చేరింది. దీనితో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ కార్ రేసింగ్ ఉంటుంది. దీనికి అవసరమైన పనులు త్వరలోనే మొదలు కానున్నాయి.

చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యుట్ ఓవర్లుకింగ్పై ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ను నిర్మించే ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ ట్రాక్ ఉంటుంది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. దీనికోసం ప్రత్యేకంగా ట్రాక్, తారు రోడ్డును నిర్మించడానికి త్వరలో సన్నాహాలు చేయనుంది.

రేస్ నడుస్తోన్న సమయంలో అవసరమైన పిట్స్టాప్స్, ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పనులను త్వరలో చేపట్టనుంది. తొలిదశలో హుస్సేన్ సాగర్ వద్ద ఈ రేస్ను నిర్వహించనుంది ప్రభుత్వం. అనంతరం దీన్ని నగర శివార్లకు తరలించే అవకాశాలు లేకపోలేదు. ఎక్కడికి తరలించాలనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇప్పుడు తాజాగా ఫార్ములా-ఈ కారు వచ్చేయడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇక చకచకా సాగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.