డెఫ్లింపిక్స్: స్వాగత ఏర్పాట్లు లేవని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అథ్లెట్ల నిరసన
హైదరాబాద్: గతేడాది రియోలో జరిగిన ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించి భారత్కు చేరుకున్న క్రీడాకారులకు అటు అభిమానులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఇటీవలే లార్డ్స్ వేదికగా ముగిసిన మహిళల వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన మిథాలీ సేనకు ముంబైలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా టర్కీలో ముగిసిన డెఫ్లింపిక్స్లో ఐదు పతకాలు(ఒక స్వర్ణం సహా) గెలిచి స్వదేశానికి చేరుకున్న క్రీడాకారులకు ఢిల్లీ విమాశ్రయంలో నిరాశ ఎదురైంది. ఐదు పతకాలు గెలిచినా తమను పట్టించుకోకపోవడంపై చెవిటి అథ్లెట్లు నిరసన తెలిపారు. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చేదిలేదని తేల్చి చెప్పారు.

మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న క్రీడాకారులు
క్రీడాకారులు, సహాయ సిబ్బంది సహా మొత్తం 46 మంది డెఫ్లింపిక్స్ పోటీలను ముగించుకుని మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అభిమానులు, ప్రభుత్వం నుంచి తమకు ఊహించని రీతిలో స్వాగతం లభిస్తుందని వారంతా అనుకున్నారు. కానీ, వారిని విమానాశ్రయంలో వారిని ఎవరూ గుర్తించలేదు. స్వాగత ఏర్పాట్లు కూడా చేయలేదు.

తాము సాధించిన పతకాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన 46 మంది అథ్లెట్లు, సహాయక బృందం అక్కడే నిరసన తెలిపారు. తాము సాధించిన పతకాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు. తమ విజయాలతోపాటు ఆగస్టు 1న తాము స్వదేశానికి చేరుకుంటామని కేంద్ర మంత్రిత్వ శాఖకు ముందుగానే తెలియజేసిన, ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

తమను పట్టించుకునేవారే లేరు
చరిత్రలో ఎన్నడూ లేనన్ని మెడల్స్ ఈసారి తాము తీసుకొచ్చినా కనీసం క్రీడా మంత్రి కూడా తమకు స్వాగతం పలకడానికి రాలేదని వాళ్లు వాపోయారు. తమను పట్టించుకునేవారే లేరని వాళ్లు చెప్పారు. దీనికి నిరసనగా తమ పతకాలను తిరిగి ఇచ్చేస్తామని వాళ్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ అథ్లెట్ల విజయాల్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్లు.. తమ ప్లేయర్స్ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ అధికారి కేతన్ షా ప్రశ్నించారు.

ఇండియా నుంచి ఇదే అత్యుత్తమ ప్రదర్శన
డెఫ్లింపిక్స్లో ఈసారి ఇండియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన తమకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని ఆయన ప్రశ్నించారు. క్రీడామంత్రి విజయ్ గోయెల్తో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన స్పందించలేదని ఆరోపించారు. డెఫ్లింపిక్స్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శేఖర్తో జోడీ కట్టిన తెలంగాణ అమ్మాయి జఫ్రీన్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications