
హైదరాబాద్: భారత యువ షూటర్ మను బాకర్పై హర్యానా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ మండిపడ్డారు. 2018 అక్టోబర్లో జరిగిన యూత్ ఒలింపిక్స్లో స్వర్ణాన్ని స్వర్ణాన్ని సాధించినందుకు గాను అభినందనలు తెలుపుతూ హర్యనా ప్రభుత్వం అప్పట్లో రూ.2 కోట్లు నజరానా ప్రకటిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
అయితే, మను బాకర్కు ఇప్పటివరకు ప్రభుత్వం ఆ నజరానాను ఇవ్వలేదు. దీంతో అనిల్ విజ్ రూ.2కోట్ల నజరానా ఇస్తామని గతంలో చేసిన ట్వీట్ల స్క్రీన్షాట్స్ పోస్టు చేస్తూ "సర్.. దయచేసి చెప్పండి ఇది నిజమేనా? లేక కేవలం జుమ్లా(తప్పుడు హామీ)" అంటూ శుక్రవారం మను బాకర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో మను బాకర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సానుకూలంగా స్పందించాల్సింది పోయి కాస్తంత ఘాటుగా స్పందించారు. "మనుబాకర్ దీని గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడానికి ముందు ఓ సారి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ను సంప్రదించాల్సి ఉండేది. ఆమె ఇలా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం బాకర్ రెండు కోట్ల నజరానాను అందుకుంటారు. ఇటువంటి విషయంలో క్రీడాకారులకు కొద్దిగా క్రమశిక్షణ ఉండాలి. ఇలా వివాదాన్ని సృష్టించినందుకు బాకర్ పశ్చాత్తాప పడాలి. తనకు ఎంతో భవిష్యత్ ఉంది. ఆమె కేవలం తన ఆటమీద మాత్రమే దృష్టి పెట్టాలి" అని మంత్రి ట్వీట్ చేశారు.