చండీఘడ్:ఒలంపిక్ లో పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ హర్యానా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ ఖండించారు.సాక్షిమాలిక్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ఒలంపిక్స్ లో తాను పతకం సాధించిన తర్వాత హర్యానా ప్రభుత్వం ఇచ్చిన హమీ అమలు కాలేదని రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.మీడియాకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు పరిమితమయ్యాయని ఆరోపించారు.

అయితే సాక్షి మాలిక్ ఆరోపణలపై హర్యానా రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నుండి ఆమె రూ.2.5 కోట్ల చెక్ తీసుకొన్నారని అనిల్ విజ్ చెప్పారు.
సాక్షి మాలిక్ కోరిక మేరకు ఎండి యూనివర్శిటీలో ఒక పోస్టును కూడ సృష్టించినట్టు ఆయన చెప్పారు. సాక్షి మాలిక్ చేసిన ఆరోపణలను తప్పుడు ఆరోపణలుగా ఆయన ఖండించారు. అయితే సాక్షి మాలిక్ తండ్రి కూడ హర్యానా ప్రభుత్వం చెక్ ఇచ్చిన విషయం వాస్తవమేనని చెప్పారు.