
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకం సాధించిన స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియాకు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన రవి కుమార్ రజతం గెలిచిన సందర్భంగా అతడిపై వరాల జల్లు కురిపించింది. రూ. 4కోట్లు నగదు బహుమతి, క్లాస్ 1 కేటగిరిలో ఉద్యోగం రవి కుమార్కు ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా.. రవికి 50శాతం రాయితీతో ప్లాట్ను ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది. అంతేకాదు రవి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్ శిక్షణ కోసం ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు హరియాణా ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెజ్లింగ్ విభాగంలో పతకం సాధించిన రవి కుమార్ దహియాపై ప్రశంసల వర్షం కూడా కురుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. రవి కుమార్ని చూసి దేశం గర్విస్తోందని వారు కొనియాడారు. 'ఈ విజయంతో భారత దేశం గర్వపడుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో బౌట్స్కు వచ్చి అసలైన ఛాంపియన్గా నిలిచావు. భారతదేశానికి కీర్తి తెచ్చినందుకు అభినందనలు' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
'రవి కుమార్ దహియా ఒక అద్భుతమైన రెజ్లర్. అతని పోరాట స్ఫూర్తి మరియు దృఢత్వం అద్భుతమైనవి. టోక్యో 2020లో రజత పతకం సాధించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు. అతని విజయాలపై భారతదేశం చాలా గర్వపడుతుంది' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'రవి కుమార్ దహియా అద్భుత విజయం. మీ స్టయిల్లో కుస్తీ పోటీల్లో పతకం తెచ్చినందుకు అభినందనలు' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీటారు. రజతం గెలిచినందుకు రవికి అభినందలు తెలుపుతూ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రవి కుమార్ పేరు మార్మోగిపోతోంది.
గురువారం 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రెజ్లర్ జవుర్ ఉగుయెవ్ చేతిలో రవి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్లో సిల్వర్ గెలిచిన రెండో ఇండియన్ రెజ్లర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో 2012 ఒలింపిక్స్లో సుశీల్ కుమార్ రెజ్లింగ్లో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన రవి దహియా ఏకంగా ఫైనల్ చేరి అందరిని ఆశ్చర్యపరిచాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇండియాకు ఇది ఐదో మెడల్.
జవుర్ ఉగుయెవ్ 57 కిలోల కేటగిరీలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ అన్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో బెల్గ్రేడ్లో జరిగిన వరల్డ్కప్ను గెలుచుకున్నాడు. ఆపై తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగాడు. గత 15 టోర్నమెంట్లలో ఉగుయెవ్ 14 మెడల్స్ గెలిచాడు. అందులో 12 గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. 2020 వరల్డ్కప్లో ప్రత్యర్థులపై 45-1 స్కోరుతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. ఉగుయెవ్తో దహియా 2019 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో ఆడి ఓడిపోయాడు. అప్పుడు భారత రెజ్లర్ రవి 6-4తో ఓడి.. బ్రాంజ్ మెడల్ గెలిచాడు.