
హైదరాబాద్: రాజకీయ నాయకుడిగా కొత్త ఇన్నింగ్స్ను ఆరంభిద్దామని భావించిన ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్కు హర్యానా ప్రజలు గట్టి షాకిచ్చారు. హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బరోడా అసెంబ్లీ నుంచి పోటీ చేసిన యోగేశ్వర్ దత్ ఓడిపోయాడు.
హర్యానా ఎన్నికలకు ముందు యోగేశ్వర్ దత్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బరోడా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేశారు.
అయితే, గురువారం విడుదలై ఫలితాల్లో తన ప్రత్యర్ధి, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ కృష్ణ హుడా చేతిలో ఓటమిపాలయ్యాడు. మరోవైపు దాద్రి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మరో మహిళా రెజ్లర్ బబితా ఫోగట్ సైతం ఓడిపోయింది. మరోవైపు హాకీ ఇండియా మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ మాత్రం లీడింగ్లో ఉన్నారు.
సందీప్ సింగ్ పెవోవా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాకు అక్టోబర్ 21న ఎన్నికల జరిగాయి. ఓటింగ్ శాతం 68.47గా నమోదైంది. అయితే, 2014తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం బాగా తగ్గడం విశేషం. 2014లో హర్యానాలో 76.54గా ఓటింగ్ శాతం నమోదైంది.