బెంగళూరు: మహిళను వేధించిన కేసులో క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పైన విడుదలైన విషయం తెలిసిందే. మిశ్రా వేధించినట్లుగా ఫిర్యాదు చేసిన మహిళ... అతని మాజీ ప్రియురాలు వందన అని తెలుస్తోంది.
వందనా జైన్తో మిశ్రా దాదాపు మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడని తెలుస్తోంది. ఆ సమయంలో భారత జట్టులో లేకపోవడంతో అతని వ్యవహారం బయటకు రాలేదంటున్నారు. బాలీవుడ్ నిర్మాత అయిన వందన... సిసిఎల్లో బెంగాల్ టైగర్స్ జట్టుకు సహయజమాని.
ఆ రోజు ఏం జరిగింది?
తన పైన మిశ్రా దాడి చేశాడని మహిళ గత వారం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. విచారణ నిమిత్తం అతడు అశోకనగర పోలీసు స్టేషన్లో మంగళవారం హాజరయ్యాడు. మూడు గంటల విచారణ అనంతరం పోలీసులు మిశ్రాను అరెస్టు చేశారు. తర్వాత జామీను పొంది అతడు తిరిగెళ్లాడు.
జామీను నిబంధనల ప్రకారం క్రికెట్ ఆడేందుకు విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇక్కడి కోర్టు నుంచి అమిత్ మిశ్రా అనుమతి పొందాల్సి ఉంటుంది. టీమిండియా శిక్షణ శిబిరానికి హాజరైన మిశ్రాను చూసేందుకు సెప్టెంబరు 27న హోటల్కు వెళ్లగా.. అతడు దూషించి తనపై టీ కెటిల్తో దాడి చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
అమిత్ మిశ్రాను కలిసేందుకు తాను హోటల్ గదికి వెళ్లానని, ఆ సమయంలో అతడు లేకపోవడంతో కాసేపు నిరీక్షించానని, అతను వచ్చీ రాగానే తన అనుమతి లేకుండా గదిలోకి ఎందుకు వచ్చావని తిట్టాడని, ఈ క్రమంలో తనను టీ కెటిల్తో కొట్టాడని, నా గొంతు నులమడంతో ఊపిరి ఆడలేదని, అరిచానని, ఆ తర్వాత తామిద్దరం కాసేపు అక్కడే కూర్చున్నామని తెలిపింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఏడుస్తూ గది నుంచి వెళ్లిపోయానని ఫిర్యాదులో పేర్కొంది.
ఐతే తాను ఆ మహిళపై దాడి చేయలేదని పోలీసుల విచారణలో అమిత్ మిశ్రా చెప్పాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల గదుల్లోకి బయటి వ్యక్తులు రాకూడదని గుర్తు చేశాడు.
ఆ రోజు రాత్రి గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో మహిళ వచ్చిందని, ఇక్కడికి వచ్చేందుకు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించానని అమిత్ మిశ్రా చెప్పాడు. ఆమె తనను దూషించిందన్నాడు. అదే సమయంలో తన కాలు ఆమెకు తగిలి టీ కెటిల్ కిందపడింది. తాను టీ కెటిల్తో దాడి చేయలేదని చెప్పాడు.
పూర్తి వివరాలు అందాకే మిశ్రాపై నిర్ణయం: బీసీసీఐ
అమిత్ మిశ్రా అరెస్టు ఉదంతంపై బీసీసీఐ స్పందించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి, ఐపీఎల్ చైర్మన్ అయిన రాజీవ్ శుక్లా మీడియాతో అన్నాడు. అయితే మిశ్రాపై నమోదైన అభియోగాలు రుజువయ్యేంత వరకు అతను జట్టులో ఆడతాడన్నాడు.
బీసీసీఐ ఈ అంశాన్ని గమనిస్తోందని, మిశ్రాపై ఆరోపణలు వాస్తవమా కాదా అన్నది ముందు తేలాలని, ఈ కేసుకు సంబంధించి పోలీసులు వాళ్ల విధులను నిర్వర్తిస్తున్నారని, దీనిపై పూర్తి వివరాలు వెల్లడయ్యాకే మిశ్రాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.