బ్రస్సెల్: బెల్జియం ఫుట్బాల్ ఆటగాడు గ్రెగరీ మెర్టెన్స్ గుండెపోటుతో రెండు రోజుల క్రితం మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి మెరుగుపడటం లేదని వైద్యులు చెప్పారు.
సోమవారం రాత్రి కేఆర్జీ గెంక్ - కేఎస్జీ లోకెరెన్స్ మధ్య రిజర్వ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆట 15వ నిమిషంలో లోకెరెన్స్ డిఫెండర్ 24 ఏళ్ల గ్రెగరీ మెర్టెన్స్ అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

దీంతో అతనికి మైదానంలోనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రెగరీని కృత్రిమ కోమాలో ఉంచి చికిత్స చేస్తున్నారని, త్వరలోనే కోలుకుంటాడని లోకెరెన్స్ క్లబ్ ఆశాభావంతో ఉంది.
మరోవైపు, వైద్యులు గ్రెగరీ మెర్టెన్స్ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని చెబుతున్నారు. అతని పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని వైద్యులు బుధవారం చెప్పారు. గ్రెగరీ మెర్టెన్స్ లోకేరెన్ తరఫున స్వదేశంలో ఆడుతుండగా సంఘటన జరిగింది.