
హైదరాబాద్: గోపీ థోనకల్... ప్రస్తుతం భారతదేశం మొత్తం మారుమ్రోగిపోతున్న పేరు. ఎందుకో తెలుసా? ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో భారత్కు బంగారు పతకం సాధించాడు. అంతేకాదు ఆసియా మారథాన్లో టైటిల్ నెగ్గిన తొలి భారత ఆటగాడిగా గోపీ చరిత్ర సృష్టించాడు.
గోపీ థోనకల్ ప్రస్తుతం భారతీయ ఆర్మీలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2016 సమ్మర్ ఒలింపిక్స్లో కూడా భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆదివారం చైనాలోని డాంగ్గువాన్లో జరిగిన రేసులో కేరళకు చెందిన గోపీ 42.195 కి.మీ. దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 48 సెకెన్లలో పూర్తిచేశాడు.
దీంతో ఈ మారథాన్లో స్వర్ణం సాధించాడు. కాగా, ఉజ్బెకిస్తాన్కు చెందిన ఆండ్రే పెట్రోవ్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఆండ్రే 2 గంటల 15 నిమిషాల 51 సెకెన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. ఇక మూడో స్థానంలో మంగోలియాకు చెందిన బ్యాంబలే సెవీన్రవ్డాన్ నిలిచాడు.
2 గంటల 16 నిమిషాల 14 సెకెన్లలో గమ్యాన్ని చేరుకుని కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, ఆసియా మారథాన్లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్గా గోపీ థోనకల్ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985), సునీత గోదర (1992) మాత్రమే ఆసియా మారథాన్లో స్వర్ణాలు గెలిచిన జాబితాలో ఉన్నారు.
వాస్తవానికి 1988 వరకు ఈ మారథాన్ రేసు.. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగేది. అయితే 1988 నుంచి ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ను వేరుచేసి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ముగిసిన ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ 16వది కావడం విశేషం.