

జకార్తా: ఒలింపిక్స్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులున్న టోర్నీ ఆసియా గేమ్స్. అలాంటి ఆసియా గేమ్స్లో పతకాలు సాధించడమనేది ప్రతీ అథ్లెట్ కల. ఇందుకోసం వారు ఏళ్ల పాటు చెమటోడ్చి మరీ సిద్దమవుతారు. అయితే, తృటిలో పతకం చేజారిపోతేనే ఆ అథ్లెట్ల బాధ అంతా ఇంతా కాదు.
ఇక, వచ్చిన పతకం చేజారిపోతే.. అది మాటల్లో చెప్పలేని మనోవ్యథగా మిగిలిపోతుంది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో ఓ భారత అథ్లెట్ ఇలానే పతకం చేజార్చుకున్నాడు. పతకం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.
వివరాల్లోకి వెళితే... ఆదివారం జరిగిన 10వేల మీటర్ల పరుగులో భారత స్ప్రింటర్ గోవిందన్ లక్ష్మణన్ ఫైనల్ రేసులో పాల్గొన్నాడు. ఫైనల్ పోరులో 29 నిమిషాల 44:91 సెకన్లలో పరుగు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిన గోవింద్ కాంస్య పతకం సాధించినట్లు తొలుత ప్రకటించారు.
ఇక్కడ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ సాధించిన బెహ్రయిన్ స్ప్రింటర్ చాని హసన్తో రేసును పూర్తి చేసే సమయంతో పోల్చితే గోవిందన్ దాదాపు నిమిషం వెనుకబడ్డాడు. దాంతో స్వర్ణం పతకం సాధించే అవకాశాన్ని స్వల్ప తేడాలో కోల్పోయాడని భారత అభిమానులు భావించారు.
కనీసం కాంస్య పతకం సాధించాడు కదా అని అనుకున్నారు. కానీ, చిన్నపాటి తప్పిదం కారణంగా ఆ పతకం కూడా చేజారింది. రేసు పూర్తి చేసే క్రమంలో ఓ చోట అతడి కాలు తెలుపు రంగు లైన్కు బయటవైపు పడినట్లు తేలింది. దీంతో డిస్క్వాలిఫై చేశారు.
దీంతో నాలుగో స్థానంలో నిలిచిన చైనా ఆటగాడు చాంగ్హాంగ్కు కాంస్య పతకం అందుకున్నాడు. దీంతో ఆసియా గేమ్స్లో 20 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో తొలిసారి పతకం లభించిందన్న ఆనందం ఎంతోసేపు అభిమానులకు నిలవలేదు.