పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో ఆరు రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభంకానున్నాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన క్రీడాకారులు పట్టుదలతో సిద్ధమయ్యారు. అయితే వాళ్లలో తెలుగు అమ్మాయి జ్యోతికశ్రీ దండి కూడా ఒకరు.
23 ఏళ్ల జ్యోతికశ్రీ పతకం సాధిస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతా ఆశతో ఉంది. అయితే విశ్వక్రీడల వరకు చేరుకున్న అథ్లెట్ జ్యోతికశ్రీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. డాక్టర్ కావాలనుకున్న ఆమె తన తండ్రి కోసమే పతక లక్ష్యంగా ఒలింపిక్స్కు చేరింది. మహిళల 4x400 మీటర్ల రిలే టీమ్లో భారత్ తరఫున పోరాడనుంది. ఆగష్టు 9న జ్యోతిక మైదానంలో బరిలోకి దిగనుంది.

ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు జ్యోతిక శ్రీది. ఆమె చదువులో టాపర్. పదో తరగతిలో 97 శాతం మార్కులు సాధించింది. డాక్టర్ కావడం ఆమె చిన్ననాటి కల. కానీ జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు క్రీడాకారుడు. బాడీబిల్డర్ అయిన శ్రీనివాసరావు తన కూతురుని గొప్ప క్రీడాకారిణిని చేయలనుకున్నాడు. విశ్వక్రీడలపై దేశం తరఫున జ్యోతిక పతకం సాధించాలని భావించాడు. దీంతో నాన్న కోసం జ్యోతికశ్రీ అథ్లెట్గా మారింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒలింపిక్స్కు చేరింది. ఇప్పుడు తన తండ్రితో పాటు 140 కోట్ల మంది ఆశల కోసం విశ్వక్రీడల్లో పోరాడుతోంది.
ఇక జ్యోతిక కెరీర్ విషయానికొస్తే.. 13 ఏళ్ల వయసులో తన తండ్రి దగ్గర శిక్షణ ప్రారంభించింది. ఆ తర్వాత విజయవాడలో సాయ్ కోచ్ వినాయక్ ప్రసాద్ శిక్షణలో, హైదరాబాద్లో గోపీచంద్ మైత్రా అథ్లెటిక్స్ ప్రాజెక్టులో భాగంగా కోచ్ నాగపురి రమేశ్ దగ్గర సాధన చేసింది. 2017 ప్రపంచ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 400మీ. రిలేలో ప్రాతినిధ్యం వహించింది.
2021లో అండర్-23 మహిళల 400మీ. పరుగులో జాతీయ ఛాంపియన్గా నిలిచింది. 2023 జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, ఇండియన్ గ్రాండ్ ప్రి- 2,4 పోటీల్లో బంగారు పతకాలు గెలిచింది. ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, వరల్డ్ రిలే ఛాంపియన్షిప్ల్లో సత్తా చాటి తాజాగా ఒలింపిక్స్కి అర్హత సాధించింది.