అలపుఝా (కేరళ): కేరళ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భారత క్రీడా అథారిటీ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో శిక్షణ పొందుతున్న నలుగురు మహిళా అథ్లెట్లలో గురువారంనాడు ఒకరు మరణించగా, మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
సీనియర్ల వేధింపులను తట్టుకోలేక వారు విషపూరితమైన పండ్లను తిని వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. స్థానికంగా పండే ఒథలాంగా అనే పండ్లను వారు తిన్నట్లు అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు ఎసల్ఎఐ వసతి గృహంలో వాటిని తిన్నారు.
వాటిని తిన్న తర్వాత వారు స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వారిని సాయంత్రం 7 గంటలకు ఆస్పత్రికి తరలించారు. అలపుఝా వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 ఏళ్ల అథ్లెట్ మరణించింది.

వారిని సీనియర్లు కొంత మంది శారీరకంగా, మానసికంగా హింసించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను హాస్టల్ వార్డెన్ ఖండించారు. వారు స్పృహ తప్పిన తర్వాత మాత్రమే తనకు విషయం తెలిసిందని చెప్పారు.
విచారణకు ఆదేశించి, బాధ్యులపై కేసులు నమోదు చేసే వరకు తాము జాతీయ రహదారిని అడ్డుకుంటామని, అంత్యక్రియలు కూడా చేయబోమని మరణించిన అథ్లెట్ బంధువులు అంటున్నారు.