బెంగళూరు: బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురు బుకీలను కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. సూరజ్, బల్రాజ్, అనిల్ కుమార్, నజీర్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. సుల్తాన్ పాళ్య ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంటులో ఉండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.23 లక్షల నగదు, 24 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఓ క్యాష్ కౌంటింగ్ యంత్రం కూడా లభ్యమైంది. సూరజ్ నేతృత్వంలోని ఈ బెట్టింగ్ రాకెట్, దుబాయ్ తదితర దేశాల్లోని పందెపురాయుళ్ళతో సంప్రదింపులు జరుపుతుండేదని, వారి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించగా తేలింది.
హవాలా మార్గంలో బెట్టింగ్కు సంబంధించిన చెల్లింపులు జరిగేవని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాకుండా, భారత్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ మ్యాచ్ల పైనా వీరు బెట్టింగ్కు పాల్పడ్డారేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.