శ్రీనగర్: గత 35 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను సోమవారం తొలగించారు. 1980 నుంచి జేకేసీఏ అధ్యక్షుడిగా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
బీసీసీఐ నుంచి మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆయనపై పిటిషన్ దాఖలైంది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆయనను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఆయన అధ్యక్షుడిగా కొనసాగడానికి అర్హడు కాదంటూ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు.

దీనిపై జరిగిన ఓటింగ్లో 64 మంది సభ్యులున్న సంఘంలో 45 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆయనపై వేటు పడింది. ఆయన స్ధానంలో ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడల మంత్రిగా ఉన్న ఇమ్రాన్ రజా అన్సారీ క్రికెట్ సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘానికి జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ ఇక్బాల్, ట్రెజరర్గా అబ్దుల్ రూఫ్ను నియమించారు. ఇదిలా ఉండగా అధ్యక్షపదవి నుంచి తనని తొలగించడం అన్యాయమని, చట్ట వ్యతిరేకమని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.