
భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పీటీ ఉషకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) ఆమెను ప్రతిష్టాత్మక 'వెటరన్ పిన్' అవార్డుకు ఎంపిక చేసింది. భారత దేశంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం లాంటిదే వెటరన్ పిన్ అవార్డు.
ఈ అవార్డుకు ఎంపికైన విషయాన్ని పీటీ ఉష ట్విట్టర్లో తెలిపింది. 'ప్రపంచ అథ్లెటిక్స్లో సుదీర్ఘకాలం చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు అందజేస్తారు. అలాంటి పురస్కారానికి నేను ఎంపికవడం సంతోషంగా ఉంది. ఐఏఏఎఫ్కు కృతజ్ఞతలు' అని పరుగులు రాణి ట్వీట్ చేసింది. దోహాలో సెప్టెంబర్ 24న జరిగే ఐఏఏఎఫ్ కాంగ్రెస్లో ఉషకు ఈ అవార్డును అందజేస్తారు.
'ప్రపంచ అథ్లెటిక్స్కు చేసిన సేవలకుగాను ఈ అవార్డుకు మిమ్మల్ని ఎంపిక చేయడం సంతోషంగా ఉంది' అని ఐఏఏఎఫ్ సీఈవో జా రిడ్గియాన్ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు, బెస్ట్ ఆసియన్ అథ్లెట్ అవార్డు, బెస్ట్ గోల్డెన్ బూట్ ఆఫ్ అథ్లెట్ అవార్డు, గ్రేటెస్ట్ విమెన్ అథ్లెట్ అవార్డులు ఉష ఖాతాలో ఉన్నాయి. తాజాగా వెటరన్ పిన్ అవార్డు కూడా చేరనుంది.
1964 జూన్ 27న కేరళలో ఉష జన్మించారు. 1976లో అథ్లెటిక్ కోచ్ నంబియార్ ఉష సామర్ధ్యాన్ని గుర్తించి కోచింగ్ ఇచ్చాడు. 1979-80 మధ్య జరిగిన అనేక జాతీయ స్థాయి పరుగు పోటీలలో పతకాలు సాధించింది. 1981లో జరిగిన అథ్లెటిక్స్ 100, 200 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇక 1985 ఆసియా క్రీడల్లో 100, 200, 400 మీటర్ల పరుగుతో పాటు 400 మీటర్ల హర్డిల్స్, 4్ఠ400 మీటర్ల రిలేలో ఐదు స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించింది.