హైదరాబాద్: పారా సైక్లిస్ట్ ఆదిత్య మెహతాకు బెంగళూరు తీవ్ర అవమానం ఎదురైంది. హైదరాబాద్ వెళ్లడానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తనను భద్రతాధికారులు అవమానించారని, వికలాంగుడినని కూడా చూడకుండా తన కృత్రిమ కాలు తీయాలని వేధించడంపై ఆదిత్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ వెళ్లేందుకు గురువారం ఉదయం 5.30కు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదిత్య వచ్చాడు. చెకింగ్లో భాగంగా అక్కడున్న భద్రతా సిబ్బంది అతడి కృత్రిమ కాలుని విప్పి చూపించాలని బలవంతం చేశారు. దీంతో చేసేదేమీ లేక కృత్రిమ కాలిని విప్పదీసి సిఐఎస్ఎఫ్ అధికారి ఠాకూర్ దాస్కు చూపించాడు.

కాలుతో పాటు తన బట్టలు కూడా విప్పించారని అతడు ఫేస్బుక్లో ఆవేదన చెందుతూ పోస్టు పెట్టాడు. అంతేకాదు తాను బట్టలు విప్పుతుండగా వాళ్లు నవ్వుతుండడం మరింత అవమానంగా అనిపించిందని తెలిపాడు. తాను ధరించిన కృత్రిమ కాలును తిరిగి వేసుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుందని ఆదిత్య తెలిపినప్పటికీ తన పట్ల కనికరం ప్రదర్శించలేదన్నాడు.
అయినా సరే, కృత్రిమ కాలిని ఊడదీసి చూపించాలని భద్రతాధికారి ఒత్తిడి చేసినట్టు పేర్కొన్నాడు. తాను ఆ ప్రయత్నంలో ఉండగానే, విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటన రావడంతో, గత్యంతరం లేక హడావుడిగా కృత్రిమ కాలును ధరించానని, అప్పటి నుంచి భరించలేనంత నొప్పితో బాధపడ్డానని చెప్పాడు.
గతంలోనూ ఇదే అధికారి (ఠాకూర్ దాస్) తనను ఇలానే ఇబ్బందిపెట్టాడని అతడు వాపోయాడు. తాను ఏ విమానాశ్రయంలోనూ ఇలా అవమానం ఎదుర్కోలేదని ఆదిత్య ఆవేదన చెందాడు. విమానాశ్రయ అధికారులు దివ్యాంగుడనే కనికరం కూడా లేకుండా ఆదిత్య పట్ల ఇలా వ్యవహరించడం ఇది రెండోసారి.
గతేడాది ఆగస్టులో కూడా ఇలాగే వ్యవహరించారని చెప్పాడు. బెంగళూరులో ఒకసారి, ఢిల్లీలో మరోసారి సెక్యూరిటీ పేరుతో అధికారులు అతనిని వేధించారు. పారా ఆసియా ఛాంపియన్షిప్లో ఆదిత్య రెండు రజత పతకాలు గెలిచాడు.