హైదరాబాద్: లాస్ వెగాల్లోని టీ-మొబైల్ అరీనాలో 'ఫైట్ ఆఫ్ ది మిలీనియమ్'గా అభివర్ణించిన పోరులో ఫ్లాయిడ్ మేవెదర్ అనూహ్య రీతిలో 29 ఏళ్ల కానర్ మెక్ గ్రెగోర్ను ఓడించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ బౌట్లో ఫ్లాయిడ్ మేవెదర్ విజయం సాధించాడు.

రెండేళ్ల క్రితం పకియావ్తో మ్యాచ్ అనంతరం బాక్సింగ్కు వీడ్కోలు పలికి.. తర్వాత మనసు మార్చుకున్న 40 ఏళ్ల మేవెదర్ శనివారం కానర్ మెక్గ్రెగర్తో తలపడ్డాడు. 10 రౌండ్లపాటు జరిగిన మ్యాచ్లో పాయింట్ల ఆధారంగా మేవెదర్ గెలుపొందినట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా అజేయంగా 50 మ్యాచ్లు గెలిచిన తొలి బాక్సర్గా చరిత్ర సృష్టించాడు. తొలి రౌండు నుంచి గ్రెగోర్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఐదో రౌండ్ నుంచి ఆట తీరును మెవెదర్ పూర్తిగా మార్చేశాడు. ప్రత్యర్థికి ఎంతమాత్రమూ అవకాశం ఇవ్వకుండా తన పంచ్లతో ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించాడు.
తొలి రౌండ్లో 10 పాయింట్లు సాధించి, ఆపై రెండు, మూడు రౌండ్లలో 9 పాయింట్లకు పరిమితమైన మెవెదర్, ఆపై మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. నాలుగు నుంచి 8 రౌండ్ల వరకూ వరుసగా పదేసి పాయింట్ల చొప్పున మేవెదర్ సంపాదించుకోగా, గ్రెగోర్ 9 పాయింట్లకే పరిమితమయ్యాడు.
ఇక, కీలకమైన చివరి రౌండ్లలోనూ మేవెదర్ ఆధిపత్యం కొనసాగింది. ఈ బౌట్లో గ్రెగోర్ అలసిపోయినట్టు స్పష్టంగా కనిపించాడు. మెక్గ్రెగర్ ప్రస్తుతం అల్టిమేట్ ఫైటింగ్ చాంపియనషిప్ (యూఎఫ్సీ) లైట్ వెయిట్ చాంపియన్గా ఉన్నాడు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్లో నెగ్గిన మేవెదర్ను బాక్సింగ్ దిగ్గజాలతో పాటు పలువురు అభినందించారు.
