పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు మరో గ్రూప్ స్టేజ్ మ్యాచ్కు సిద్ధమైంది. ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో ఇవాళ తలపడనుంది. తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్పై సింధు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని చిత్తు చేసి కేవలం 29 నిమిషాల్లోనే 21-9, 21-6తో మ్యాచ్ను ముగించింది. గత కొన్నాళ్లుగా ఫామ్ లేనప్పటికీ విశ్వక్రీడల్లో తానెంత ప్రమాదకరమో చాటిచెప్పింది.
అయితే సింధు హ్యాట్రిక్ ఒలింపిక్స్ మెడల్స్ సాధించడం ఖాయమని ఆమె తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. OneIndia, Mykhel ప్రతినిథులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన తన కూతురు తప్పక ఫైనల్కు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్లో సింధు రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా సింధు తనపై ఉన్న అంచనాలను అందులేకపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో గాయపడిన సింధు పునరాగమనం తర్వాత గత ఫామ్ను అందిపుచ్చుకోలేక పోయింది.

ఒలింపిక్స్లో ఫామ్ కంటే ఆ రోజు మెరుగైన ప్రదర్శనే చాలా కీలకమని, దేశం గర్వించేలా తన కూతురు పోరాడుతుందని పీవీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. ''గాయం నుంచి కోలుకుని తిరిగి అదే స్థాయిలో సత్తాచాటడం అంత సులువైన విషయ కాదు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ ఆటలో. కామన్వెల్త్ గేమ్స్-2022 తర్వాత మోకాలి గాయం నుంచి కోలుకున్న అనంతరం 2023 అక్టోబర్ 27న సింధు తిరిగొచ్చింది. ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. సింధు శ్రమ, ఫ్యామిలీ సపోర్ట్, దేశం ప్రార్థనలు ఆమెను తిరిగి ఫామ్లోకి తెచ్చాయి''
''అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సింధు పూర్తిస్థాయి శిక్షణకు తిరిగి వచ్చింది. ప్రకాష్ పదుకొణె, SAI,ఇతరత్రా విభాగాలు సింధును ఒలింపిక్స్ బరిలోకి దిగేలా సన్నద్ధం చేశారు. పారిస్ ఒలింపిక్స్ డ్రాలో సింధు కఠిన ప్రత్యర్థులు వచ్చారు. కానీ నా కూతురు మరోసారి ఫైనల్కు చేరుతుందని నమ్ముతున్నా. ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ వంటి క్రీడలో మ్యాచ్ రోజు ఎలా ప్రదర్శన చేశామనేదే చాలా ముఖ్యం''
''ఇక బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ సర్ దేశానికి మరో పతకం అందించాలని,సింధుకు శిక్షణ ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ శిక్షణను సింధు మనసు పెట్టి పూర్తిచేసింది. జర్మనీలో సింధుతో ప్రకాష్ సర్ జులై 22వరకు ఉన్నారు. అంతేగాక బెంగళూరులో సింధు శిక్షణలో ఎంతో సమయం వెచ్చించిన ప్రకాష్ సర్కు హృదయపూర్వక ధన్యవాదాలు''
''ఇక విజయం సాధించినప్పుడు మెచ్చుకునే ప్రజలే ఓడిపోతే తీవ్ర విమర్శలు చేస్తారు. ఇవి సింధుపై కచ్చితంగా కొద్దిమేర ప్రభావితం చేస్తాయి. కానీ సింధు మానసికంగా చాలా దృఢంగా ఉంది. దేశం కోసం నిలకడగా ప్రదర్శన చేసే సింధు ఎవరికీ నిరూపించుకోవాల్సిన పనిలేదు. దేశం మరోసారి గర్వించేలా సింధు సత్తాచాటుతుందని మేం విశ్విస్తున్నాం'' అని పీవీ రమణ పేర్కొన్నారు. పారిస్ విశ్వక్రీడల్లో సింధు పతకం సాధిస్తే.. ఒలింపిక్స్లో మూడు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కుతోంది.