న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ కిరీటాన్ని భారత్ నిలబెట్టుకుంటుందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ను ప్రతి ఒక్కరూ తోసిపుచ్చుతున్నారని, అది అత్యంత ప్రమాదకరమైందని, నాకవుట్ గేమ్స్ ఎలా ఆడాలో భారత క్రికెటర్లకు తెలుసునని ఆయన అన్నారు. 2011లో వారు అద్భుతంగా ఆడారని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన మార్గదర్శకత్వంలోనే భారత్ ప్రపంచ కప్ను గెలుచుకుంది.
భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్ను గెలిచినవారని, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో వారికి తెలుసునని, వారి చుట్టూ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లున్నారని, వారిని లెక్కలోంచి తీసేయరాదని, ఏం చేస్తున్నారో వారికి తెలుసునని ఆయన అన్నారు.

ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ప్రతి ఒక్కరికీ పద్ధతులుంటాయని, నువ్వు ఏం చేయగలవో అదే చేయాలని, నువ్వు చేయలేనిదాన్ని చేయడానికి ప్రయత్నించకూడదని, ఈ జట్టు మంచి ఫలితం సాధించగలదని, ఈ జట్టు 2013 చాంఫియన్స్ ట్రోఫీని గెలుచుకుందని, బాగా ఆడగల యువ ఆటగాళ్లను చేర్చుకుని మంచి జట్టుగా రూపుదిద్దుకుందని ఆయన అన్నారు .
భారత్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లకు ట్రోఫీ గెలుచుకనే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇవే టాప్ ఫోర్ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేయకూడదని ఆయన అన్నారు. ప్రపంచ కప్లో అంచనాలు వేయడం కష్టమని ఆయన అన్నారు.
గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు మూడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయని, ప్రపంచ కప్ పోటీలకు ముందు న్యూజిలాండ్ కూడా మంచి ఆటతీరును కనబరిచిందని ఆయన అన్నారు.