పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకే దిగే భారత రైఫిల్, పిస్టల్ షూటింగ్ జట్టును జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ) మంగళవారం ప్రకటించింది. రెండు విభాగాలకు 15 మంది షూటర్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ చోటు దక్కించుకుంది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడనుంది.
ఇటీవల నిర్వహించిన ట్రయల్స్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా భారత జట్టును ఎంపిక చేశారు. ట్రయల్స్లో 19 ఏళ్ల ఇషా సింగ్ సత్తాచాటింది. ఈ హైదరాబాదీ గత ఆసియా క్రీడల్లో, ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణపతకాలు గెలిచిన విషయం తెలిసిందే. విశ్వక్రీడల్లోనూ మెరిసి పతకాన్ని ముద్దాడాలని భావిస్తోంది. కాగా, షాట్ గన్ విభాగంలోనే పాల్గొనే షూటర్ల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ఇటలీలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత షాట్గన్ జట్లను ప్రకటిస్తారు.

కాగా పిస్టల్ విభాగంలో ఇషా సింగ్, శరబ్జ్యోత్ సింగ్, అర్జున్ చీమా, మను బాకర్, రిథమ్ సంగ్వాన్, అనీష్ బన్వల్ చోటు దక్కించుకున్నారు. అలాగే రైఫిల్ విభాగంలో సందీప్ సింగ్, అర్జున్ బబుతా, ఇలవేనిల్ వలరివన్, రమిత, సిఫ్త్కౌర్, అంజుమ్ మౌద్గిల్, ఐశ్వరీ తోమర్, స్వప్నిల్ జట్టులో స్థానం సంపాదించారు. స్టార్ షూటర్ మను బాకర్ పిస్టల్లో రెండు ఈవెంట్లలో బరిలోకి దిగనుంది. 10 మీటర్ల పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ విభాగాల్లో పోటీ పడనుంది.
ఇక సందీప్సింగ్, అర్జున్ బబుతా, ఇలవేనిల్, రమిత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీపడనున్నారు. అలాగే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో సిఫ్త్కౌర్ అంజుం మౌద్గిల్, ఐశ్వరీ తోమర్, స్వప్నిల్ కుస్లే పోటీలో ఉన్నారు. శరబ్జ్యోత్ సింగ్, అర్జున్ చీమా, రిథమ్ సాంగ్వాన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో; అనీష్ బన్వాల్, విజయ్వీర్ సిద్ధూ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీలో ఉన్నారు.